మందుబాబులకు జగన్ సర్కార్ మరో షాక్

ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం విధించే దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో, ఏపీలోని మందుబాబులంతా జగన్ సర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ఓ పక్క మద్యం ధరలను అమాంతం పెంచేసిన ప్రభుత్వం…మరో పక్క మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఇక, ఏపీలో కొన్ని బ్రాండ్ల మద్యాన్నే అమ్మడం వంటి చర్యలతో…తమ ఫేవరెట్ బ్రాండ్లు దొరక్క మందుబాబులకు కిక్కు చాలడం లేదు. దీంతో, ఏపీలోని మందుబాబులకు పెద్ద చిక్కు వచ్చిపడింది. ఇక్కడ దొరికే బ్రాండ్లు తాగలేక….పొరుగు రాష్ట్రం తెలంగాణకు వెళ్లి మద్యం కొనేందుకు నానా తిప్పలు పడుతున్నారు మందుబాబులు. హైకోర్టు తాజా తీర్పుతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి 3 బాటిళ్లు తెచ్చుకోవచ్చని కొందరు మందుబాబులు హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలోని కొందరు మందుబాబులకు తీపి కబురు అందించిన జగన్ సర్కార్……మరి కొందరు మందుబాబులకు షాక్ ఇచ్చింది. మరోసారి మద్యం ధరలను పెంచింది జగన్ సర్కార్. రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యంపై ధరలను పెంచిన ఏపీ ప్రభుత్వం…. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న బ్రాండ్లపై ధరలను తగ్గించింది. బీర్లు, రెడీ టు డ్రింక్‌ ధరలు తగ్గించింది. ఐఎంఎఫ్‌ లిక్కర్‌, ఫారెన్‌ లిక్కర్‌, బీర్‌, వైన్‌ ధరలను ప్రభుత్వం క్రమబద్దీకరించింది. మంత్రివర్గ భేటీ తర్వాత ఏపీలోని మద్యం ధరలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తమ మద్యం బ్రాండ్ల ధరలు పెరిగినా….తోటి మందుబాబులలో కొందరి బ్రాండ్ల ధరలు తగ్గడంతో మందుబాబులంతా ఫుల్ జోష్ లో ఉన్నారట. ఏపీలో మందుబాబులకు ఒకేసారి తీపి, చేదు కబుర్లు అందడంతో….కిక్కురుమనకుండా కిక్కు ప్రాప్తిరస్తు అనుకుంటున్నారట.