ఆ దర్శకుడికి మహేష్ గుడ్ బై

మహేష్ బాబు చాలామంది స్టార్ డైరెక్టర్లతో పని చేశాడు. కానీ వాళ్లెవ్వరితోనూ కనిపించని సాన్నిహిత్యం వంశీ పైడిపల్లి విషయంలో కనిపించింది. హీరోగా మైల్ స్టోన్ మూవీ అనదగ్గ తన 25వ సినిమాను అతడితోనే చేశాడు. ‘మహర్షి’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాకు ఎంత హైప్ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమాకు మిక్స్డ్‌ టాక్ వచ్చినప్పటికీ.. చివరికిది సక్సెస్ ఫుల్‌ మూవీగానే నిలిచింది.

‘మహర్షి’ తర్వాత కూడా వంశీతో తన స్నేహాన్ని కొనసాగించాడు మహేష్. వీళ్లిద్దరి కూతుళ్లు సితార, ఆద్య కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయి.. ఇద్దరూ కలిసి యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు కూడా చేశారు. మహేష్, వంశీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మారిపోయి దేశ విదేశాలు తిరిగారు. ‘మహర్షి’ విషయంలో అంత సంతృప్తిగా లేని అభిమానులు వ్యతిరేకత వ్యక్తం చేసినా పట్టించుకోకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత సినిమాను వంశీతోనే చేయాలనుకున్నాడు మహేష్.

కానీ ఈ సినిమా కథ చెప్పే వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ కథ మహేష్‌ను మెప్పించకపోవడం, అంతకుముందెప్పుడో విన్న పరశురామ్ కథను ఓకే చేసి ఆ సినిమాను పట్టాలెక్కించడంతో వంశీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారిపోయింది. ఇంటర్వ్యూల్లో మాత్రం మహేష్‌తో సినిమా తప్పక ఉంటుందని చెప్పుకున్నాడు కానీ.. అలాంటి సంకేతాలేమీ కనిపించలేదు. ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ పూర్తి చేయగానే మహేష్‌తో పని చేయడం కోసం వేరే స్టార్ డైరెక్టర్లు చాలామంది లైన్లో ఉన్నారు.

అనిల్ రావిపూడి మళ్లీ మహేష్‌తో ఓ సినిమా చేయొచ్చంటున్నారు. త్రివిక్రమ్ లైన్లోకి రావచ్చంటున్నారు. మహేష్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా 2022 ఆరంభంలో మొదలయ్యే అవకాశం ఉండటంతో మహేష్ మహా అయితే మధ్యలో మరో సినిమా చేయగలడంతే. ఆ అవకాశం వంశీకి వచ్చేలా అయితే ఎంతమాత్రం కనిపించడం లేదు. ఇక రాజమౌళితో సినిమా చేశాక వంశీకి అతను అందుతాడనుకుంటే పొరబాటే. కాబట్టి వంశీకి శాశ్వతంగా మహేష్ గుడ్ బై చెప్పేసినట్లే అన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం.