ఇప్పట్లో షూటింగులు చేసేంత ధైర్యం లేదన్న బాబు

కరోనా మహమ్మారి దెబ్బకు విధించిన లాక్ డౌన్ వల్ల అనేక రంగాలు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రంగాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ముఖ్యంగా వేలాది మంది పనిచేసే సినీ రంగంపై కూడా ఈ ప్రభావం బాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగులు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం చాలా రోజుల క్రితమే అనుమతినిచ్చింది.

కొన్ని సినిమాలు, షోలు, సీరియళ్ల చిత్రీకరణ కూడా మొదలైంది. తాజాగా కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలకు సినిమా షూటింగులకు అనుమతినిచ్చింది. అయితే, కరోనా భయంతో చాలామంది షూటింగులు జరిపేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగులపై ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన సినిమాలకు సంబంధించిన షూటింగ్ మాత్రం మరో 2-3 నెలల వరకు ప్రారంభించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తన సినిమా షూటింగ్ సెట్ లో ఉండే 150 మందిని కాపాడగలననే నమ్మకం తనకు లేదని, ఆ నమ్మకం ఉన్నవారు షూటింగులు చేసుకోవచ్చని అన్నారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల ఆరోగ్యమే అన్నిటికన్నా ముఖ్యమని, ఇపుడున్న పరిస్థితుల్లో వారి ఆరోగ్యానికి తాను గ్యారెంటీ ఇవ్వలేనని సురేష్ బాబు చెప్పారు. రోడ్ల మీద కూడా 30 శాతం మంది మాస్క్ లను ధరించడం లేదని ఆయన అన్నారు. ఇన్నికష్టాలు పడి సినిమా రిలీజ్ చేసినా…తన ఫ్యామిలీ, స్నేహితులతో కలిసి తానే థియేటర్ కు వెళ్లనని, అటువంటపుడు ఇంత కష్టపడి షూటింగులు జరపడం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

ఏసీ ఆర్ నాన్ ఏసీ హాల్లో లో మాస్క్ కట్టుకుని, నవ్వొస్తే నవ్వకుండా సినిమాను ఆస్వాదించలేమని అన్నారు. సినీ కార్మికుల ఉపాధి కోసం షూటింగ్స్ చేయడం సబబేనని, అయితే, దాన్ని ఎవరు హ్యాండిల్ చేయాలన్నదే సమాధానం లేని ప్రశ్న అని సురేష్ బాబు చెప్పారు. టీవీ షూటింగుల పరిస్థితి వేరని, ఒక రోజు షూటింగుకు 50 వేలు లాభం వస్తుందన్న గ్యారంటీ వారికి ఉంటుందని, సినిమా వాళ్లకు ఆ గ్యారంటీ లేదని అన్నారు.

సినీ కార్మికుల ఉపాధి కోసమే ఎస్పీ బాలసుబ్రహ్మణం టీవీ షోలు చేస్తున్నారని, కానీ, ఆయన కరోనాబారినపడి ప్రాణాపాయ స్థితి నుంచి అదృష్టవశాత్తూ బయట పడ్డారని, దురదృష్టవశాత్తు ఏదన్నా జరిగి ఉంటే యావత్ దేశం బాధపడాల్సి వచ్చేదని అన్నారు.

ఇపుడున్న పరిస్థితుల్లో షూటింగులు చేసే ధైర్యం తనకు లేదని, ధైర్యం ఉన్నవారు షూటింగ్స్ చేసుకోవచ్చని సురేష్ బాబు స్సష్టం చేశారు. సురేష్ బాబు వంటి అగ్ర నిర్మాత ప్రాక్టికల్ గా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఇపుడు జనం ఆసుపత్రులు, మెడికల్ షాపులు, నిత్యావసరాలు మినహా…మరే ఇతర అవసరాలకు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని, అటువంటిది వినోదం కోసం థియేటర్లకు వస్తారన్న గ్యారెంటీ లేదని నెటిజన్లు అంటున్నారు. ఒక వేళ వచ్చినా….సగం సీటింగ్ కెపాసిటీతో….సాధారణ టికెట్ ధరలతో ఎన్నాళ్లు థియేటర్లు రన్ చేయడగలరని ప్రశ్నిస్తున్నారు. ఇక, షూటింగ్ స్పాట్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా….కరోనా బారిన పడరన్న గ్యారెంటీ లేదని, అందుకే సురేష్ బాబు చెప్పినట్లు మరి కొన్నాళ్లపాటు వేచి ఉండడం బెటర్ అని అనుకుంటున్నారు.