టీవీ చర్చలో తీవ్ర ఆగ్రహానికి గురైన కొరటాల

ఇంతకుముందు ‘శ్రీమంతుడు’ కథను కాపీ కొట్టాడంటూ ఆరోపణలు ఎదుర్కొన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఆ వివాదం తర్వాత సద్దుమణిగిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో తీస్తున్న ‘ఆచార్యం’ కథ విషయంలో వివాదం నడుస్తోంది. రాజేష్ మండూరి అనే రచయిత ఈ కథ తనదని అంటున్నాడు. దీనిపై అతను తన వెర్షన్ వినిపించాడు.

టీవీ చర్చల్లోకి కూడా వెళ్లాడు. అక్కడా సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు. ఇప్పటిదాకా ఈ ఆరోపణలపై కొరటాల స్పందించలేదు. ఐతే ఓ టీవీ ఛానెల్.. రాజేష్ లైన్లో ఉండగా కొరటాలను కూడా చర్చలోకి తీసుకొచ్చింది. ఈ చర్చలో ముందు కొరటాల కూల్‌గానే తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. కానీ తాను చెప్పింది రాజేష్ అర్థం చేసుకోకుండా ఒకటే మాట అంటుండటంతో ఆయనకు కోపం వచ్చేసింది. తీవ్ర అసహనానికి, ఆగ్రహానికి గురయ్యారు కొరటాల. ఆ కోపానికి కారణం ఏంటంటే..

రాజేష్ ‘ఆచార్య’ కథ తనది అంటున్నాడని.. మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు అతను కథ చెప్పినట్లు చెబుతున్నాడని.. కానీ తాను ‘ఆచార్య’ చేస్తున్నది ఆ బేనర్లోనే కాదని కొరటాల చెప్పాడు. ఇక రాజేష్ రాసినట్లు చెబుతున్న కథతో అతను బ్రహ్మాండంగా సినిమా తీసుకోవచ్చని.. ఎందుకంటే తనది వేరే కథ అని.. అతడి కథేంటో కూడా తనకు తెలియదు అని కొరటాల స్పష్టం చేశాడు.

తాను ఏం కథ రాశానో, ఏం తీస్తున్నానో కూడా తెలియకుండా ఆ కథ తనదే అని రాజేష్ వాదించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజేష్ కథ, తన కథ ఒకటే అని తన కో డైరెక్టర్ చెప్పినట్లు రాజేష్ చెబుతున్నాడని.. కానీ తాను ఆ మాటే అనలేదని తన కో డైరెక్టర్ చెప్పాడని.. అయినా కోడైరెక్టర్ చెప్పాడని రెండు కథలు ఒకటే అని రాజేష్ అంటున్నాడని.. కానీ రెండు కథలు వేరని సినిమా తీస్తున్న తనే చెబుతున్నపుడు ఇంకా వివాదం ఏంటని కొరటాల ప్రశ్నించాడు. తాను ఇంత నమ్మకంగా చెబుతున్నాక రాజేష్ వెళ్లి తన కథతో తాను సినిమా చేసుకోవడానికి అభ్యంతరం ఏంటని కొరటాల ప్రశ్నించాడు.

తనకు ఒక కథ నచ్చితే డబ్బులు ఇచ్చి కథ తీసుకోలేని పరిస్థితుల్లో తాను ఉన్నానా అని కొరటాల ప్రశ్నించాడు. ఈ సందర్భంగా రాజేష్ ‘శ్రీమంతుడు’ కథా వివాదం గురించి ఎత్తితే అసలక్కడ వివాదమే లేదని.. తాను ఆ విషయం ఎత్తితే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుందని కొరటాల ఆగ్రహించాడు. ‘భరత్ అనే నేను’ మూల కథ నచ్చితే తన మిత్రుడైన శ్రీహరి నానుకు క్రెడిట్ ఇచ్చి ఆ కథ తీసుకున్న విషయాన్ని కొరటాల గుర్తు చేశాడు. కొరటాల ఎంత చెప్పినా రాజేష్ వినిపించుకోకపోవడం, కోడైరెక్టర్ చెప్పాడనే మాటకే కట్టుబడి మాట్లాడటంతో కొరటాలకు కోపం వచ్చింది. ఇప్పుడు తాను రాజేష్ తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నందుకు కోర్టుకు వెళ్తానని.. విషయాన్ని తనే పెద్దది చేస్తానని అందుకతను సిద్ధమా అని ప్రశ్నించాడు. తాను తప్పు చేస్తే జైలుకు అయినా వెళ్లడానికి సిద్ధమని రాజేష్ అన్నాడు.