రెవెన్యూ ప్రక్షాళన పై మాట నెగ్గించుకోనున్న కేసీఆర్?

ఏదైనా అంశంపై ఒకసారి ఫోకస్ పెడితే చాలు.. దాని లోతుల్లోకి వెళ్లటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. అత్యంత అవినీతి ఉన్న విభాగం ఏదన్న మాట వచ్చినంతనే అందరి నోటి నుంచి వచ్చే సమాధానం రెవెన్యూగా చెబుతారు.

దీనికి తగ్గట్లే.. ఈ విభాగంలో చోటు చేసుకునే అవినీతి అంతా ఇంతా కాదు. ఈ ఆరోపణలకు తగ్గట్లే.. ఇటీవల కాలంలో పలు ఉదంతాలు బయటకు రావటం తెలిసిందే. మొన్నటికి మొన్న కీసర్ ఎమ్మార్వో ఒక ల్యాండ్ ఇష్యూలో ఏకంగా రూ.1.10కోట్ల మొత్తాన్ని లంచంగా తీసుకోవటం చూస్తే.. అవినీతి ఏ స్థాయిలో సాగుతుందో అర్థం కావటమే కాదు.. కీలక ఫైళ్లను ట్యాంపరింగ్ చేసే విధానం కూడా బయటకు వస్తుంది.

గతంలో పలుమార్లు రెవెన్యూ విభాగంలో సంస్కరణలతో పాటు.. ప్రక్షాళన చాలా అవసరమన్న మాటను సీఎం కేసీఆర్ పదే పదే ప్రస్తావించటం తెలిసిందే. రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఉందని.. సమూల మార్పులు తప్పనిసరిగా కేసీఆర్ చెప్పటం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలపై రెవెన్యూ వర్గాలు గరంగరంగా ఉన్నప్పటికీ.. ఆ విషయాల్ని పట్టించుకోకుండా తానేం చేయాలనుకున్నారో.. ఆ పని చేసే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు.

పలువురితో సంప్రదింపులు జరిపిన సీఎం కేసీఆర్.. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురావటానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున కసరత్తు ఫామ్ హౌస్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. రెవెన్యూ శాఖపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేసీఆర్.. ఆ శాఖ విధివిధానాల్ని పూర్తిగా మార్చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. పాలన సజావుగా సాగటంతో పాటు పారదర్శకత.. జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న యోచనలో ఉన్నారు.

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టాన్ని తీసుకురావాలన్న పట్టుదలతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే.. నమూనా సిద్ధమైందని.. తుదిమెరుగులు దిద్దుతున్నారని చెబుతున్నారు. తాను ఒకసారి డిసైడ్ అయ్యాక.. వెనక్కి తగ్గేది లేదన్న విషయాన్ని తాజాగా మరోసారి చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.