స్నేహితుడ్ని ఇరుకున పడేస్తున్నారేంటి అక్బరుద్దీన్

సంక్షోభ సమయాల్లో అండగా నిలవాల్సిన స్నేహితుడు.. అందుకు భిన్నంగా విమర్శలు చేయటం ఏమిటన్న ఆశ్చర్యం పలువురిలో వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి మధ్యనున్న బంధం గురించి అందరికి తెలిసిందే.

అసద్ తనకు స్నేహితుడని.. మజ్లిస్ తనకు మిత్రుడన్న మాటను పదే పదే చెబుతుంటారు కేసీఆర్. అలాంటి స్నేహితుడి మీద ఓవైసీ బ్రదర్స్ స్పందించే తీరు మాత్రం భిన్నంగా ఉంటుందనే చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పడేసేలా వ్యాఖ్యలు చేయటం ఓవైసీ బద్రర్స్ లోని చిన్నోడు అక్బరుద్దీన్ కు మహా సరదా.

టీఆర్ఎస్ ను.. ఆ పార్టీ నేతలపైనే కాదు.. ప్రభుత్వం మీద కూడా తరచూ విమర్శలు చేస్తుంటారు. ఇష్యూ పెద్దదవుతుందన్న వేళలో వెంటనే వెనక్కి తగ్గటం.. సీన్లోకి పెద్ద ఓవైసీ రావటంతో ఇష్యూ మళ్లీ వెనక్కి వెళ్లిపోవటం చాలాసార్లు చూసిందే.

తాజాగా మాట్లాడిన అక్బరుద్దీన్ కోవిడ్ 19 ఆసుపత్రి గాంధీని ఉద్దేశించి ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. గాంధీ ఆసుపత్రితో జైలుగా అభివర్ణించిన అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. గాంధీ ఆసుపత్రి ఏమీ ఫైవ్ స్టార్ హోటల్ కాదన్న ఆయన మాట నూటికి నూరుపాళ్లు నిజం.

ప్రభుత్వాన్ని విమర్శించటం తప్పేం కాదు. కానీ.. ఏ విషయంలో విమర్శించాలి? ఏ విషయంలో కాదన్న విచక్షణ మరిచిన అక్బరుద్దీన్ మీద గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. అలా అని తొందరపడి విమర్శిస్తే పెద్దాయన తిడతారేమోనన్న ఉద్దేశంతో ఎవరూ తొందరపడటం లేదు. ఇంతకీ అక్బరుద్దీన్ కు కేసీఆర్ సర్కారు మీద ఎందుకు కోపం వచ్చింది?

సంక్షోభ సమయాల్లో కొన్ని విషయాల్ని చూసి చూడనట్లుగా ఉండాలనే కేసీఆర్.. తమ ప్రభుత్వాన్ని విమర్శించే వారికి కరోనా రావాలంటూ శాపాలు పెట్టటం తెలిసిందే. మరిప్పుడు అక్బరుద్దీన్ కు అలాంటి శాపాన్ని పెట్టేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తన మిత్రుడి తమ్ముడు నోరు పారేసుకునే విషయంలో కేసీఆర్ కటువైన వ్యాఖ్యలు చేస్తారా? అని నిలదీసే వారికి కొదవ లేదు.

తన అన్నకు అత్యంత సన్నిహితుడైన ముఖ్యమంత్రి మీదా.. ప్రభుత్వం మీదా అక్బరుద్దీన్ ఎందుకు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారన్నది అసలు ప్రశ్న. కాస్త నిశితంగా పరిశీలిస్తే అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. రంజాన్ మాసంలో ప్రార్థనలకు.. ఇతర అంశాలకు ఏపీలో మాదిరి ప్రత్యేక మినహాయింపుల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ విషయంపై తమకు మద్దతు ఇస్తున్న వారు గుర్రుగా ఉండటం కూడా అక్బరుద్దీన్ అలా మాట్లాడటానికి కారణంగా చెబుతున్నారు.

తమకు అండగా నిలిచే వారి మనోభావాలకు తగ్గట్లు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. దాన్ని కవర్ చేయాలంటే.. ఇష్యూను డైవర్ట్ చేయటంతో పాటు.. ప్రభుత్వానికి వంతపాడేలా తమ నేతలు వ్యవహరించటం లేదన్న సందేశాన్ని పంపాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశంతోనే గాంధీ ఆసుపత్రిపై అక్బరుద్దీన్ విమర్శలు చేశారన్న మాట వినిపిస్తోంది.