ఏపీలో బీజేపీకి 25 శాతం ఓటింగ్.. వీర్రాజు లెక్క ఏమిటంటే?

మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో విపక్షంగా మారిన టీడీపీ బాగా వీకైపోయిన వైనం స్పష్టంగానే కనిపిస్తోంది. అదే సమయంలో అధికార పక్షంగా మారిన వైసీపీ భారీ ఎత్తున బలాన్ని పుంజుకుంది. మరి 2024 ఎన్నికల సమయానికి బీజేపీ బాగా పుంజుకోవడం ఖాయమేనని కమలనాధులు లెక్కలేస్తున్నారు.

తాజాగా ఈ లెక్కలపై బీజేపీ ఏపీ శాఖకు కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ఇదే అంచనాలతో ముందుకు సాగుతూనే…. ఏపీలో బీజేపీకి ఏకంగా 25 శాతం మేర ఓటింగ్ ను సాధించడమే లక్ష్యంగా సాగుతున్నట్లుగా ప్రకటించారు.

వీర్రాజు లెక్క కాస్తంత ఇంటరెస్టింగ్ గానే కనిపిస్తున్నా… మెగాస్టార్ చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలకు దఖలు పడిన ఓట్లే బీజేపీకి మళ్లుతాయంటూ అంచనాలు కట్టడం చూస్తుంటే… నిజంగానే ఆశ్చర్యం వేయక మానదు.

వీర్రాజు కొత్త లెక్కల ప్రకారం… 2009 ఎన్నికల బరిలో నిలిచిన ప్రజారాజ్యం పార్టీ ఏకంగా 18 ఓట్లు పడ్డాయి. అదే సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీకి 18 శాతం ఓట్లు పడిన విషయాన్ని కూడా వీర్రాజు గుర్తు చేస్తున్నారు. 1998లో వాజ్ పేయి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ 18 శాతం ఓట్లతో ఏకంగా నాలుగు ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

అంటే ఏపీలో అధికార, విపక్షాలకు వెళ్లకుండా మధ్యేమార్గంగా కనిపిస్తున్న పార్టీలకు ఓట్లేసే వారు 18 శాతమని వీర్రాజు లెక్కగట్టేశారు. 1998 తర్వాత, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ పాత్ర నామమాత్రంగానే నమోదు కాగా… మొన్నటి ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగిన జనసేనకు 7 శాతం ఓట్లు పడిన వైనాన్ని వీర్రాజు ప్రస్తావిస్తున్నారు.

ఇప్పుడు పవన్ కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేనందున ఆ పార్టీకి దక్కిన 7 శాతం ఓట్లు కూడా బీజేపీ ఖాతాలో పడి… మొత్తంగా బీజేపీకి దఖలు పడే ఓట్ల శాతం 25కు చేరుతుందని వీర్రాజు అంచనాలు వేస్తున్నారు.

అయినా అటు అధికార పక్షమో, ఇటు విపక్షమో కాకుండా మధ్యేమార్గంగా ఉన్న పార్టీలకు దక్కే ఓట్లు చాలా తక్కువ మోతాదులోనే ఉంటాయి. ప్రజారాజ్యం సందర్భంగా చిరు మేనియా కనిపిస్తే… జనసేన బరిలో పవన్ మేనియా కొంత మేరకు కనిపించింది.

ఈ ఇద్దరు అన్నాదమ్ముల పార్టీలకు వచ్చిన ఓట్లే తాజాగా తమకు వస్తాయని వీర్రాజు చెబుతున్న లెక్క కాస్తంత విడ్డూరంగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే… ఓ రాజకీయ పార్టీగా అటు అధికార పార్టీని, ఇటు ఇతర విపక్ష పార్టీల విధానాలను ఎండగట్టేసి… ఆయా పార్టీల వల్ల లాభం లేదని తేల్చేసి… ఆయా పార్టీల వైపు మొగ్గే జనాన్ని తమ వైపునకు తిప్పుకోవాల్సింది పోయి… మధ్యేమార్గంగా ఓట్లేసే వారు ఇప్పుడు తమకే ఓటేస్తారని.. చిరు, పవన్ ల వైపు మొగ్గిన వారంతా ఇప్పుడు తమ వైపు తిరుగుతారంటూ వీర్రాజు అంచనాలు వేస్తుండటం నిజంగానే ఆశ్చర్యం రేకెత్తించేదేనని చెప్పక తప్పదు.