లాక్‍ డౌన్‍లో అల్లుడి కథ మారింది

లాక్‍ డౌన్‍ వల్ల సినిమా షూటింగులు ఆగిపోయి అందరినీ అసహనానికి గురి చేస్తోంటే, ఈ సమయాన్ని మరికొందరు ప్రభావవంతంగా వాడుకుంటున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‍ హీరోగా ‘కందిరీగ’ దర్శకుడు సంతోష్‍ శ్రీనివాస్‍ డైరెక్షన్‍లో రూపొందుతోన్న ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‍ దాదాపుగా పూర్తి కావచ్చింది. లాక్‍ డౌన్‍లో ఎడిటింగ్‍ చేసుకుని చూసుకోగా కథాగమనంలో కొన్ని ఇబ్బందులున్నాయని అందరికీ అనిపించిందట.

దాంతో సమస్యలున్నాయని అనిపించిన చోట సన్నివేశాలు మార్చి రాసుకుంటున్నారట. మామూలుగా ఇంత ఖాళీ దొరక్కపోతే ఈ చిత్రానికి కరక్షన్లు, రీషూట్లు వుండేవి కాదు. ఈ గ్యాప్‍ వల్ల ఎక్కువమందికి చూపించడానికి, అభిప్రాయాలు సేకరించడానికి, అవసరమయిన కరక్షన్లు చేసుకోవడానికి వీలు చిక్కింది.

కందిరీగ తర్వాత రభస, హైపర్‍ చిత్రాలతో ఫెయిలయిన సంతోష్‍ శ్రీనివాస్‍కి దర్శకుడిగా ఇది చాలా కీలకం. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‍కి కూడా ఇప్పుడు హిట్‍ బాగా అవసరం. కందిరీగ, అల్లుడు శీను తరహాలో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. నవంబర్‍లో మళ్లీ సెట్స్ మీదకు వెళ్లి వచ్చే ఫిబ్రవరికి విడుదల చేసేలా ప్లాన్‍ చేస్తున్నారు.