‘ప్రెసిడెంట్ మెడల్’ పాపం ఎవరిది ?

ఏపీలో ఏడాదిన్నరగా సాగుతున్న వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ… ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూనే ఉందని చెప్పాలి. నిత్యం ఏదో ఒక అంశంపై ఇరు పార్టీలు పోట్లాడుకుంటూనే ఉన్నాయి. ఆయా అంశాలపై తమదైన భాష్యాలు చెబుతున్న రెండు పార్టీలు.. ఆయా అంశాలకు సంబంధించిన నిజాలను మాత్రం చెప్పే ప్రయత్నం చేయడం లేదు.

ఇలాంటి ఇంకో గొడవ ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య మొదలైపోయింది. అసలే ఆరోగ్యానికి హానికరమైన మద్యపానం వద్దంటూ వైద్యులు చెబుతుంటే… ఏకంగా ‘ప్రెసిడెంట్ మెండల్’ అంటూ భారత రాష్ట్రపతి పేరును స్ఫూరించేలా ఓ మద్యం బ్రాండ్ ఏపీలో ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది.

ప్రస్తుతం సర్కారీ మద్యం షాపుల్లో విరివిగా దొరుకుతున్న ఈ మద్యం బ్రాండ్ పై నిన్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. జగన్ పోస్టర్ మెడలో ‘ప్రెసిడెంట్ మెడల్’ మద్యం బాటిల్ ను వేసి మరీ టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి.

ఈ నిరసన మంగళవారం జరగగా… బుధవారం ఉదయానికంతా దీనిపై వైసీపీ, టీడీపీల మధ్య సోషల్ మీడియా వేదకగా పెద్ద యుద్ధమే మొదలైపోయింది. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ మద్యం అమ్మకాలను చంద్రబాబు ప్రభుత్వమే ప్రారంభించిందని వైసీపీకి చెందిన అధికార ప్రతినిధి నాగరాజు యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఏకంగా జీవోనే పోస్ట్ చేశారు.

ఆ వెంటనే రంగంలోకి దిగేసిన టీడీపీ యాక్టివిస్టులు… అసలు నాగరాజు యాదవ్ చెబుతున్నట్లుగా ఆ జీవోనే కరెక్ట్ అయితే… రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా… చంద్రబాబు సర్కారు జీవోను ఎలా విడుదల చేస్తుంది? అంటూ కౌంటర్లు స్టార్ట్ చేశారు. మొత్తంగా ఇప్పుడు ఈ వివాదంపై రెండు పార్టీలకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు హోరాహోరీగా పోరాడుతున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు వచ్చి పడుతున్నాయి.

నాగరాజు యాదవ్ చెబుతున్నట్లుగా 2019 ఏప్రిల్ 19న సోరింగ్ స్పిరిట్ అనే సంస్థ.. తాను తయారు చేసిన విస్కీ డ్రాండ్ ‘ప్రెసిడెంట్ మెడల్’ ను విక్రయించుకునేందుకు అనుమతి కావాలని ఏపీ అబ్కారీ శాఖకు దరఖాస్తు చేసుకోగా… ఐదు రోజుల్లోనే అంటే 2019 ఏప్రిల్ 24న చంద్రబాబు సర్కారు అనుమతులు జారీ చేసింది. ఈ జీవో నాటి అబ్కారీ శాఖ కమిషనర్ గా ఉన్న ముఖేశ్ కుమార్ మీనా పేరిట విడుదలైనట్లుగా తెలుస్తోంది.

ఈ జీవో కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన టీడీపీ యాక్టివిస్టులు… అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా… చంద్రబాబు సర్కారు జీవోలను ఎలా జారీ చేస్తుందంటూ ప్రశ్నించారు. అంతటితో ఆగని టీడీపీ శ్రేణులు… సరే జీవో కరెక్టే అనుకుంటే… ఆ మద్యం బ్రాండ్ ను 2020 మార్చి చివరి వరకే అమ్ముకునేందుకు చంద్రబాబు సర్కారు అనుమతిచ్చింది కదా.. మరి ఇప్పుడు కూడా ఆ బ్రాండ్ ను జగన్ సర్కారు ఎలా అమ్ముతోందంటూ ప్రశ్నిస్తున్నారు.

మొత్తంగా ఈ వివాదంపై తమదైన శైలి వాదనలు వినిపిస్తున్న ఇరు వర్గాలు… అసలు నిజమేమిటనే విషయాన్ని మాత్రం చెప్పడం మానేశాయి. ఇక ఈ వ్యవహారంలో కీలకంగా మారిన జీవో నిజమైనదో, కాదోనన్న విషయాన్ని చెప్పాల్సిన జగన్ సర్కారు కూడా నోరు మెదపకపోవడం గమనార్హం.

వైసీపీ వైఖరిని చూస్తుంటే… ఈ బ్రాండ్ చంద్రబాబు హయాంలోనే మార్కెట్ లోకి వచ్చిందని అనుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో టీడీపీ వాదన చూస్తుంటే… అది అబద్దమని అనుకోవాల్సి వస్తోంది. మొత్తంగా ఇరువర్గాల వాదనలు జనాన్ని డైలమాలో పడేసేలానే ఉన్నాయని చెప్పక తప్పదు. మరి నిజాలు ఎప్పుడు బయటకొస్తాయో, ఈ గొడవ ఎప్ుడు సద్దుమణుగుతుందో చూడాలి.