అచ్చెన్నకు డబ్బులు చేరలేదట.. మరి ఎందుకిదంతా?

అవినీతికి పాల్పడటం.. భారీగా ఆదాయాన్ని సొంతం చేసుకోవటం.. నిధులు పోగేయటం లాంటివి ఆధారాలతో సహా దొరికితే చట్టపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కోవటం మామూలే. అందుకు భిన్నంగా ఆరోపణలతోనే తెగ ఇబ్బందులు పడటం ఉంటుందా? అంటే.. లేదనే చెబుతారు. అందునా.. మాజీ మంత్రి హోదాలో ఉన్న వారికి అలాంటివి ఉండవనుకుంటారు.

అందుకు భిన్నంగా ఇబ్బందులు ఎదుర్కోవటం మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విషయంలో కనిపిస్తుంది. ఈఎస్ఐలో వైద్య పరికరాలు.. మందుల కొనుగోలు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నకు సంబంధించి ఏసీబీ జేడీ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు తాము జరిపిన విచారణలో ఎక్కడా అచ్చెన్నాయుడికి ఎక్కడ నేరుగా డబ్బులు చేరినట్లుగా ఆధారాలు లభించలేదని చెప్పారు. అయితే.. విచారణ జరిగేకొద్దీ కొత్త అంశాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు.

ఒకవేళ విచారణలో ఎలాంటి ఆధారాలు లభించని పక్షంలో పరిస్థితి ఏమిటన్న దానికి సమాధానం లభించని పరిస్థితి. ఈ కుంభకోణంలో అచ్చెన్నకు నేరుగా ఎలాంటి ప్రయోజనాలు పొందనప్పటికీ.. ఆయన ఎందుకిన్ని తిప్పలు పడాల్సి వస్తోందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. సాంకేతికంగా ఆయన చేసిన తప్పే దీనికి కారణంగా చెబుతున్నారు.

సాధారణంగా మంత్రి వద్దకు పలు కంపెనీలు వస్తుంటాయి. వాటిని మంత్రులు సిఫార్సు చేయొచ్చు. అనంతరం ప్రభుత్వం వాటిని పరిశీలించి అర్హులైన వారికి అవకాశం ఇచ్చారు. అచ్చెన్న విషయంలో జరిగిన తప్పేమిటంటే.. సిఫార్సుకు బదులుగా ఒప్పందం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయటమే ఆయన కొంప ముంచిందని చెబుతున్నారు.

టెండర్లకు వెళ్లాల్సిన వాటి విషయంలో ఇలా చేయకూడదని.. అందుకే అచ్చెన్నతో పాటు.. ఈఎస్ఐ డైరెక్టర్ ను కూడా అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. లక్ష రూపాయిలకు మించిన కొనుగోళ్లలో ఈ-టెండర్లు నిర్వహించాలి. కానీ.. వందల కోట్లకు పైగా సాగిన కొనుగోళ్లలో అలాంటివేమీ జరగకపోవటమే మాజీ మంత్రి అచ్చెన్న కొంప ముంచినట్లుగా చెబుతున్నారు. దీంతో పాటు.. కేటాయించిన దాని కంటే ఎక్కువగా కొనుగోళ్లు చేయటం వెనుక ఏం జరిగిందన్న అంశం మీదా ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతంలో రానున్న రోజుల్లో తెర మీదకు వచ్చే అంశాలు.. అచ్చెన్న ఫ్యూచర్ ఏమిటన్నది తేలుస్తుందని చెబుతున్నారు.