ఛోటా టెక్నీషియన్‌కు మెగా ఆఫర్

మంగళవారం ఉదయం ప్రభాస్ కొత్త సినిమా ‘ఆది పురుష్’ ప్రకటించినప్పటి నుంచి.. ఆ సినిమా జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతోంది. ట్విట్టర్లో ట్రెండ్స్ అన్నీ ఆ సినిమా గురించే కనిపిస్తున్నాయి. ‘రూ.250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘తానాజీ’కి దర్శకుడైన ఓమ్ రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికరమైన వార్తలొస్తున్నాయి. రూ.300 కోట్లతో మొదలుపెట్టి రూ.500 కోట్ల దాకా చెబుతున్నారు బడ్జెట్ లెక్కలు. ‘బాహుబలి’ని మించిన భారీతనంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో భాగమయ్యే ప్రతి ఒక్కరికీ ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టే. ఇందులో ముఖ్య పాత్రలు పోషించబోయే మిగతా నటీనటుల గురించి ఇంకా ఏ వివరాలు వెల్లడి కాలేదు.

ఐతే ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా మాత్రం కార్తీక్ పళని పేరు వినిపిస్తోంది. ఈ టెక్నీషియన్ ఇప్పటిదాకా చిన్నా చితకా చిత్రాలే చేశాడు. వాటిలో ఏదీ ఐదు కోట్ల బడ్జెట్‌ను మించింది లేదు. తెలుగులో బ్రాండ్ బాబు, నెక్స్ట్ నువ్వే లాంటి చిన్న చిత్రాలకు ఛాయాగ్రహణం అందించాడు కార్తీక్. భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఛాయాగ్రాహకుడు తిరు దగ్గర అతను శిష్యరికం చేశాడు. ఐతే కార్తీక్ చివరగా పని చేసిన ‘పెంగ్విన్’ సినిమాకు సంబంధించి మిగతా విషయాలన్నీ ప్రేక్షకులను నిరాశకు గురి చేసినప్పటికీ అందులో ఛాయాగ్రహణం మాత్రం హైలైట్ అయింది. కోడైకెనాల్ అందాల్ని భలేగా ఎలివేట్ చేశాడతను.

సినిమా చూసిన వాళ్లందరూ ఛాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో పనితనం, కార్తీక్ పనితనం గురించి ఉన్న ఫీడ్ బ్యాక్‌తో ‘ఆదిపురుష్’ ఛాయాగ్రహణ బాధ్యతల్ని అతడికే అప్పగించినట్లు చెబుతున్నారు. అత చిన్న సినిమాలకు పని చేసి ఒకేసారి ఇంత భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకోవడం అంటే మాటలా?