‘కోళికోడ్’ కో పైలట్ కథ తెలిస్తే కన్నీళ్లే..

2020 మే 8.. వందే భారత్ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకురావడం కోసం మొదలుపెట్టిన బృహత్ కార్యక్రమంలో భాగంగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు తొలి విమానం వచ్చింది. ఆ విమాన పైలట్లకు కోళికోడ్‌లో ఘన స్వాగతం లభించింది. అందులో అఖిలేష్ కుమార్ కూడా ఒకడు. కరతాళ ధ్వనులతో అతడిని స్వాగతించారు.

కరోనా ముప్పును పట్టించుకోకుండా విధులు నిర్వర్తించడమే ఆ ప్రశంసలకు కారణం. ఆ తర్వాత కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అతను వందే భారత్ మిషన్లో భాగంగా ఎయిర్ ఇండియా సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా దుబాయ్ నుంచి కోళికోడ్‌కు వచ్చిన విమానంలోనూ అతను ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ విమానం క్రాష్ ల్యాండ్ అయింది.

170 మందికి పైగా ప్రాణాలు కాపాడి.. పైలట్ దీపక్ సాథెతో పాటు కో పైలట్ అయిన అఖిలేష్ కూడా ప్రాణాలు విడిచాడు. మూడు నెలల కిందట సాదర స్వాగతం అందుకుంటూ సగర్వంగా విమానం నుంచి బయటికి వచ్చిన అఖిలేష్ ఇప్పుడు విగత జీవుడై బయటికి రావడం అందరినీ కలచి వేస్తోంది.

దీనికి మించిన బాధాకరమైన విషయం ఏంటంటే.. అఖిలేష్ భార్య మేఘా ఇంకో రెండు వారాల్లో బిడ్డకు జన్మనివ్వాల్సి ఉంది. నిండు గర్భిణిగా ఉన్న ఆమె అఖిలేష్ మరణ వార్త విని తట్టుకోలేకపోతున్నారు. ఇంకొన్ని రోజుల్లో బిడ్డను సంతోషంగా ఈ లోకంలోకి ఆహ్వానించాల్సిన ఆ కుటుంబం ఇప్పుడు అఖిలేష్ మృతితో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అఖిలేష్ స్వస్థలం ఉత్తర ప్రదేశ్‌లోని మథుర. 2017లో అతను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ‘ఫస్ట్ ఆఫీసర్’గా చేరారు.