జగన్ విజ్ఝప్తికి మోదీ ఓకే… డిసెంబర్ దాకా సీఎస్ గా సాహ్నినే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్ని ఈ ఏడాది చివరి దాకా కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం రాత్రి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఓ మూడు నెలల పాటు నీలం సాహ్ని పదవీ కాలాన్ని పెంచుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ గడువు వచ్చే నెలాఖరు (సెప్టెంబర్ 30)తో ముగియనుంది. దీంతో ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఇటీవలే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖకు సానుకూలంగానే స్పందించిన మోదీ సర్కారు… నీలం పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించేందుకు సమ్మతి తెలిపింది.

ఈ మేరకు కేంద్రం నుంచి సమాచారం వచ్చిన వెంటనే ఏపీ ప్రభుత్వం నీలం సాహ్నిని ఈ ఏడాది చివరి (డిసెంబర్ 31) దాకా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించనున్నట్లుగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి జూన్ నెలాఖరుకే నీలం పదవీ విరమణ చేయాల్సి ఉంది.

అయితే సీఎస్ గా నీలంనే మరింత కాలం కొనసాగించాలనే ఉద్దేశ్యంతో ఆమె పదవీ కాలాన్ని ఆరు నెలల పాటు పొడిగించాలని కేంద్రానికి జగన్ లేఖ రాశారు. జగన్ ఆరు నెలల కోరితే… అప్పుడు కేంద్రం మూడు నెలల పొడిగింపును మాత్రమే ఇచ్చింది. ఈ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుంది.

అయితే సీఎస్ గా నీలం సాహ్నిని ఈ ఏడాది చివరి దాకా కొనసాగించాల్సిందేనన్న భావనతో జగన్ మరోమారు కేంద్రానికి లేఖ రాశారు. సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ఆయన సదరు లేఖలో కేంద్రాన్ని కోరారు.

జగన్ విజ్ఝప్తి మేరకు సాహ్ని పదవీ కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమాచారం అందిన మరుక్షణమే సీలం సాహ్నిని మరో మూడు నెలల అంటే… ఈ ఏడాది చివరి (డిసెంబర్ 31)దాకా సీఎస్ గా కొనసాగించనున్నట్లు జగన్ సర్కారు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.