ప్రజాదరణ సీఎంలలో ర్యాంకులో దూసుకెళ్లిన ఏపీ సీఎం జగన్

YS JAgan

దేశంలో చాలానే మీడియా సంస్థలు ఉన్నప్పటికీ.. కొన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంటుంది. రాజకీయ అంశాలకు సంబంధించి నిర్వహించే సర్వేలలో ఇండియా టుడే గ్రూపుకు ఉన్న విశ్వసనీయతను ఎవరూ తక్కువ చేయలేరు.

తరచూ వారు.. వివిధ సర్వేల్ని నిర్వహిస్తుంటారు. తాజాగా ఆ మీడియా సంస్థ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకు సంబంధించిన ఫలితాల్ని తాజాగా వెల్లడించారు. జులై 15 నుంచి 27 మధ్య కాలంలో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

దేశంలో అత్యంత ప్రజాదరణ చెందిన ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలి స్థానంలో నిలిచారు. రెండోస్థానంలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది. 19 రాష్ట్రాల్లోని 97 లోక్ సభ నియోజకవర్గాల్లో ఈ సర్వేను నిర్వహించారు.

జులై 15 నుంచి 27 మధ్య కాలంలో దాదాపు 12,021 మందిని ఫోన్ లో ఇంటర్వ్యూల ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టినట్లుగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. మరి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ర్యాంకు మాటేమిటి? అంటారా? అక్కడికే వస్తున్నా.

ఈ సర్వేలో కేసీఆర్ ర్యాంకు తొమ్మిదో స్థానంగా పేర్కొన్నారు. కరోనా మొదట్లో ఆయన పేరు ప్రఖ్యాతులు దేశవ్యాప్తంగా మారుమోగగా.. తర్వాతి కాలంలో ఆయన పనితీరుపై పెదవి విరుపు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. దీనికి తగ్గట్లే.. తాజా ఫలితం ఉండటం గులాబీ బాస్ కాస్త గుర్రుగా ఉండే అవకాశం ఉందంటున్నారు.