చిరు-మెహర్.. ఆ రీమేక్‌తో

మెగాస్టార్ చిరంజీవి కొన్ని నెలల కిందటే ఓ ఇంటర్వ్యూలో తన కొత్త చిత్రాల లైనప్ గురించి మాట్లాడాడు. అందులో ఆయన తాను పని చేయబోయే కొత్త దర్శకుల పేర్లు చెప్పాడు. బాబీ, సుజీత్, మెహర్ రమేష్.. ఇవీ ఆయన వెల్లడించిన పేర్లు. ఇవేవీ కూడా మెగా అభిమానులకు అంతగా రుచించిన పేర్లు కావు. ముఖ్యంగా మెహర్ రమేష్ అనే సరికి చాలామంది బెంబేలెత్తిపోయారు.

కంత్రి, శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసిన దర్శకుడతను. ‘షాడో’ తర్వాత ఇన్నేళ్లలో మరో సినిమా చేయలేదు. అలాంటి దర్శకుడితో సినిమా ఏంటి అని ఆశ్చర్యపోయారు. కానీ చిరు అంత తేలిగ్గా అయితే మీడియాకు మెహర్ పేరు చెప్పే అవకాశం లేదు. వీళ్లిద్దరి మధ్య కథా చర్చలు జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు సినిమా కూడా ఓకే అయిపోయిందని.. త్వరలోనే ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.

కాకపోతే అభిమానులు మరీ భయపడకుండా స్ట్రెయిట్ మూవీ కాకుండా రీమేక్ కోసం మెహర్‌తో చిరు జట్టు కడుతున్నట్లు సమాచారం. తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా మూవీ ‘వేదాలం’ను చిరు హీరోగా మెహర్ రీమేక్ చేస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్‌తో తీయడానికి ఒకప్పుడు సన్నాహాలు జరిగాయి. కానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు చిరు ఆ రీమేక్‌ మీద మనసు పడ్డారట.

ఆల్రెడీ చిరు రీఎంట్రీలో ‘కత్తి’ రీమేక్‌లో నటించారు. అలాగే మలయాళ సినిమా ‘లూసిఫర్’ను రీమేక్ చేయబోతున్నారు. దాని విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. మరోవైపు కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో కూడా సినిమా దాదాపుగా ఓకే అయినట్లే అంటున్నారు. కానీ అన్నిటికంటే ముందు మెహర్‌తో ‘వేదాలం’ రీమేక్‌లో నటించబోతున్నాడని.. ఇదే ఆయన 153వ చిత్రం అని అంటున్నారు. దీనిపై చిరు పుట్టిన రోజు నాడు స్పష్టత వచ్చ అవకాశముంది.