ఆయన అద్వానీ పేరెత్తగానే..

2020 ఆగస్టు 5.. భారత దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక రోజు. హిందువులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పరిణామం చోటు చేసుకుందీ రోజు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఈ రోజే శంకు స్థాపన జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమంలో ఎంతో వైభవంగా, ఉద్వేగ భరిత వాతావరణంలో జరిగింది.

ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ సహా ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడంలో కీలక పాత్ర పోషించి.. రామ మందిర ఏర్పాటు దిశగా ఎంతో పోరాడిన.. అలాగే భారతీయ జనతా పార్టీకి దేశంలో తిరుగులేని ఆదరణ రావడంలో కీలకంగా వ్యవహరించిన అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ ఈ ఘట్టంలో పాలుపంచుకోలేక పోవడం విచారకరం.

వయసు ప్రభావం, కరోనా ముప్పు లాంటి కారణాలు చెబుతున్నారు కానీ.. గత కొన్నేళ్లలో ఉద్దేశపూర్వకంగా అద్వానీకి పార్టీలో ప్రాధాన్యం తగ్గించేసిన మోడీ.. ఈ కార్యక్రమానికి ఆయన వస్తే ఆయనకు క్రెడిట్ వెళ్లిపోతుందన్న ఉద్దేశంతో పక్కన పెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కానీ రామమందిర శంకు స్థాపన కార్యక్రమంలో అద్వానీ పేరు వినిపించకుండా ఏమీ లేదు. ర్యాలీలో ఆద్యంతం ఆయన పేరు మార్మోగింది. శంకు స్థాపన సందర్భంగానే జై అద్వానీ నినాదాలు వినిపించాయి. అలాగే భూమిపూజ తర్వాత జరిగిన బహిరంగ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. అద్వానీ పేరెత్తారు.

మందిర నిర్మాణం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది పోరాటాలు చేశారని, ఆ జాబితాలో కొందరు కాలం చేసినా, మరికొందరు ఇప్పటికీ జీవించి ఉన్నారని తెలిపారు. అయోధ్య రథయాత్ర ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఎల్‌కే అద్వానీ ఇంట్లోనే కూర్చుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.