రాజధాని గేమ్‌లో పొలిటికల్ లూజర్స్ ఎవరు ?

విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడం చర్చనీయంశంగా మారింది. బిల్లు సెలక్ట్ కమిటీ ముందు ఉన్న సమయంలో గవర్నర్ దీనికి ఆమోదం తెలపడంపై విపక్ష టీడీపీ వంటి పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

రాజధానిని మూడుగా చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది. గవర్నర్ ఆమోదముద్రతో వైసీపీ పట్టు బిగిసింది. అయితే ఇక్కడ రాజధానిని మూడు ముక్కలు చేయడంతో అమరావతి సహా కృష్ణా, గుంటూరులో వైసీపీకి ఎదురుగాలి వీస్తుందని, ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీపై విశాఖ సహా ఉత్తరాంధ్రలో చేదు అనుభవం ఎదురవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాజధాని ఏర్పడుతుందన్న ధీమాతో 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 34 వేల ఎకరాలను ఏపీ కోసం త్యాగం చేశారు. అమరావతిలో రాజధాని ఏర్పడటంతో గ్రామాలతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. తమ ప్రాంతం మున్ముందు హైదరాబాద్ వంటి రాజధానిలా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు ఆనందపడ్డారు.

ఇప్పుడు అది రివర్స్ కావడంతో ఈ ప్రాంతవాసులు, ప్రధానంగా రైతుల ఆగ్రహాన్ని చవిచూస్తోంది వైసీపీ. రాజధాని రైతులు దీర్ఘకాలంగా నిరసన దీక్షలు కొనసాగిస్తున్నారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మురిసిపోతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం మూడుముక్కలు చేసి ఏటూ కాకుండా చేసిందని ఈ ప్రాంతావాసులు గుర్రుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కచ్చితంగా మైనస్ అవుతుందని భావిస్తున్నారు.

2024 ఎన్నికల సమయానికి మరిచిపోవడానికి ఇది చిన్న అంశం కాదని, టీడీపీ, జనసేనలు ఈ వాదనను బలంగా లేవనెత్తుతాయంటున్నారు. కృష్ణా, గుంటూరు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ‘అమరావతి’ నినాదంపై ఉప ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ చేస్తోంది. రాజధాని అంశం ఇక్కడ వైసీపీకి మైనస్ అయితే, ఇప్పటికే మంచి బలం ఉన్న టీడీపీకి మరింత ప్లస్ అని భావిస్తున్నారు. మనకు ఇక్కడ ఓటమి తప్పదని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట.

విశాఖ, ఉత్తరాంధ్ర, కర్నూలులో ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాజధాని వికేంద్రీకరణను టీడీపీ వ్యతిరేకించడంపై ఈ ప్రాంతవాసులకు కూడా ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయడం వల్ల హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయామని, మున్ముందు తాము నష్టపోవద్దంటే మూడు రాజధానిలు బెట్టర్ అని, దీనిని టీడీపీ వ్యతిరేకించడం సరికాదని కొంతమంది అంటున్నారు.

విశాఖ, కర్నూలులో టీడీపీకి మంచి బలం ఉంది. రాజధానిపై నిర్ణయం వల్ల కొంత ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర కీలక నేత గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడి, వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆగస్ట్ 9న ఆయన జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.

విశాఖ జిల్లాలో గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు జగన్‌తో భేటీ అయ్యారు. కేవలం వైసీపీ కండువా కప్పుకోలేదు. ఇప్పుడు కీలక నేత గంటా ఏకంగా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విశాఖలో టీడీపీ ప్రజాప్రతినిధులు అందరూ అధికార పార్టీ వైపు వెళ్ళడమే అక్కడ ప్రజాగ్రహానికి నిదర్శనమని చెబుతున్నారు.

గంటాతో పాటు మరికొందరు కీలక నేతలు కూడా వైసీపీలో చేరవచ్చునని, ఆ తర్వాత కొనసాగే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. రాజధాని అంశంపై టీడీపీ నిర్ణయాన్ని విశాఖ సహా ఉత్తరాంధ్ర, సీమవాసులు వ్యతిరేకిస్తున్నారని భావించవచ్చునని అంటున్నారు. స్వయంగా కొంతమంది టీడీపీ నేతలు కర్నూలులో న్యాయరాజధానిని స్వాగతించారు. అమరావతి రాజధాని కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.

టీడీపీ అక్కడే ఇరుక్కుపోయింది… ఎవరికి ఎక్కువ నష్టం

3 రాజధానుల అంశాన్ని టీడీపీ వ్యతిరేకిస్తోంది అనేకంటే వ్యతిరేకించాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. ఎందుకంటే రాజధాని కోసం టీడీపీ ప్రభుత్వం వేలాది ఎకరాలు సేకరించింది. సింగపూర్, జపాన్ అంటూ కలలు కన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి తల ఊపితే అప్పుడు ఇంతా ఎందుకు చేశారని టీడీపీని అమరావతి ప్రజలు, రైతులు నిలదీసే పరిస్థితి. ఇక్కడ టీడీపీ ఇరుక్కుపోయిందని చెబుతున్నారు. కృష్ణా, గుంటూరులలో వైసీపీపై వ్యతిరేకత జగన్ ప్రభుత్వ పాలన బాగుంటే చల్లబడుతుందని, ఎటొచ్చి ఇది టీడీపీకి ఇబ్బందికరమైన పరిణామంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.