కేసీఆర్ కు చేరిన కార్పొరేట్ ఆసుపత్రుల ఆరాచకాలు?

KCR Medical COllege

అంతకంతకూ విస్తరిస్తున్న కరోనా కేసుల నేపథ్యంలో రోగులకు వైద్యం చేసే విషయంలో ప్రభుత్వ దవాఖానాలు కిందా మీదా పడుతున్నాయి. ప్రమాదకర వైరస్ తో పోరాటం.. అది కూడా నెలలకు పైబడి సాగుతున్న నేపథ్యంలో వైద్యులు.. వైద్య సిబ్బంది తీవ్రమైన అలసటకు గురవుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు పెరగటమే తప్పించి.. తగ్గని పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాల్ని చూస్తే.. ఒక్క హైదరాబాద్ మహా నగరం మినహా మిగిలిన అన్నిచోట్ల కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దీనికి తోడుగా ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల ఆరాచకాలు కూడా ఎక్కువ అవుతున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ కార్పొరేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తి.. పేషెంట్ల కంటే వారిచ్చే డబ్బుల మీదనే వారి ఫోకస్ అంతా ఉందన్నట్లుగా ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. పెద్ద ఎత్తున మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక.. సోషల్ మీడియాలో చెప్పాల్సిన అవసరమే లేదు.

ప్రైవేటు.. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డపేరు రావటమే కాదు.. తన ఇమేజ్ సైతం బద్నాం అవుతుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించినట్లుగా చెబుతున్నారు. అందుకే.. ఆయన ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేట్ ఆసుపత్రుల మీద ఉన్న ఫిర్యాదుల చిట్టాను తయారు చేయించినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే వీరి తీరుపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే 9154170960 వాట్సాప్ కు చేయాలన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమకు వచ్చిన కంప్లైంట్లను పరిశీలించిన అధికారులు.. ఏయే కార్పొరేట్ ఆసుపత్రులపై తరచూ కంప్లైంట్లు వస్తున్నాయన్న విషయాన్ని గుర్తించారు. కొన్ని ఆసుపత్రుల మీద ఎక్కువగా ఫిర్యాదు వస్తున్న విషయాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి ఒక నివేదికను సిద్ధం చేసి.. సీఎం కేసీఆర్ కు పంపినట్లుగా తెలుస్తోంది.

తమకు వచ్చిన ఫిర్యాదుల్లో ముఖ్యమైనవి.. కృత్రిమ కొరత సృష్టించి అధికడబ్బు డిమాండ్‌ చేయటం.. ఆసుపత్రిలో ఎంట్రీకి కనీసం రూ.3 నుంచి రూ.4లక్షలు అడ్వాన్స్ ఇస్తే తప్పించి ఆడ్మిషన్ ఇవ్వకపోవటం.. రోజుకు గరిష్ఠంగా రూ.2లక్షల వరకు బిల్లు వసూలు చేయటం లాంటివి చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి.

అంతేకాదు.. రోగి మరణించిన తర్వాత కూడా లక్షలాది రూపాయిలు చెల్లించాలని.. అప్పుడు మాత్రమే డెడ్ బాడీని అప్పగిస్తామని చెబుతున్న వైనాన్ని సీఎంకు పెట్టిన నోట్ లో ఉందంటున్నారు. అన్నింటికి మించిన కరోనా లేకున్నా పాజిటివ్ గా నిర్దారించే దుర్మార్గపు చర్య కూడా మొదలైందని.. ఇలాంటి వారి వద్ద అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని.. రోగి పరిస్థితి అపాయకర స్థితిలోకి చేరాక.. ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించిన వైనం కేసీఆర్ వద్దకు చేరిన ఫైల్ లో ఉందంటున్నారు.

ఈ నేపథ్యంలో.. రానున్న రోజుల్లో కార్పొరేట్లకు ముకుతాడు వేసేలా చర్యలకు ప్రభుత్వం సమాయుత్తమవుతుందని.. త్వరలోనే కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.