కాంగ్రెస్ లో పీక్స్ కు చేరిన సీనియర్.. జూనియర్ల రచ్చ

గెలుపు ధీమాను ఇస్తుంది. ఓటమి కుంగదీస్తుంది. గెలుపు బలహీనతల్ని కనిపించకుండా చేస్తుంది. అపజయం బలాన్ని తగ్గించి చూపిస్తుంది. అందుకే.. ఎంతటి మొనగాడైనా ఓటమి వేళ.. పిల్లాడి కంటే కష్టంగా కనిపిస్తాడు. అదే సమయంలో విజయం ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు.. అప్పటివరకూ పిల్లాడిగా ఉన్నోడు పెద్ద తోపుగా మారిపోతాడు. అతగాడి నుంచి వచ్చే ప్రతి మాటకు జయజయధ్వానాలు మారుమోగుతుంటాయి.

ఇప్పుడంటే పరిస్థితి బాగోలేదు కానీ.. 2004 నుంచి 2014 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి సుప్రీంగా వ్యవహరించిన సోనియాగాంధీ ముందు నోరు విప్పటానికి కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలు సైతం సంశయించేవారు. ఆచితూచి మాట్లాడేవారు.

అలాంటి అమ్మ అనుకున్నదే వేదంగా సాగేది. అమ్మ అనుకున్నంతే..పార్లమెంటు తలుపులు మూసి తాను అనుకున్నది పూర్తి చేయటాన్ని మర్చిపోలేం. అంతటి పవర్ పుల్ సోనియమ్మ ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో తెలిస్తే అవాక్కు కావటం ఖాయం. ఓటమి ఎలాంటోళ్లను ఎలా మార్చిందన్న భావన కలుగక మానదు. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన సమాచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు మరీ ఇంతలా దిగజారిపోయాయా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు తిరుగులేని అధికారాన్ని ప్రదర్శించిన సోనియమ్మ ముందు.. పార్టీకి చెందిన సీనియర్లు.. జూనియర్లు తెగ వాదులాడుకోవటం.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవటం చూసిన ఆమె మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడు రోజుల క్రితం సోనియమ్మ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం వెబ్ నార్ రూపంలో సాగింది. దీనికి సోనియమ్మతో పాటు.. మాజీ ప్రధాని మన్మోహన్ తో పాటు.. పలువురు సీనియర్ నేతలు.. రాహుల్ టీంకు చెందిన జూనియర్లు హాజరయ్యారు.

యూపీఏ ప్రభుత్వంలోని సీనియర్ నేతల కారణంగా ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని.. పార్టీ వైఫల్యానికి కారణం కూడా వారేనని రాహుల్ టీం సభ్యులు ఆరోపించారు. ఒంటికాలి మీద లేచిన వారు మన్మోహన్ తో సహా ముఖ్యనేతల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.

తన్నుకోలేదు కానీ.. వాదులాటలో అన్ని లెవెల్స్ ను పూర్తి చేశారంటూ ఒక సీనియర్ కాంగ్రెస్ నేత వాపోవటం చూస్తే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం కాక మానదు. జరుగుతున్న దానిని అడ్డుకునే ప్రయత్నం చేయని సోనియా.. నేతల మాటల్ని చూస్తూ ఉండిపోయారని చెబుతున్నారు.

కరోనా కట్టడిలోనూ.. చైనాతో ఘర్షణ సమయంలోనూ మోడీ సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టటంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందన్న సీనియర్ వ్యాఖ్యలతో రాహుల్ టీం చెలరేగిపోయిందని చెబుతున్నారు. వారు విషయాన్ని పార్టీ అధికారంలో ఉన్న పదేళ్ల కాలానికి తీసుకెళ్లి.. సీనియర్ల తీరును తీవ్రంగా ఎండగట్టినట్లుగా చెబుతున్నారు. అయితే.. సీనియర్ల వాదన వేరుగా ఉంది. పదేళ్ల మన్మోహన్ హయాంలో ఆయన పాలనను తప్పు పట్టే ప్రయత్నం బీజేపీ నేతలు సైతం చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతున్నారు.

ఒకవేళ.. మన్మోహన్ సర్కారు ఫెయిల్ అయి ఉంటే.. అప్పట్లోనే విమర్శలు వచ్చేవని చెబుతున్నారు. అయితే.. మన్మోహన్ హయాంలో బాగా జరిగిందన్న విషయాన్ని ఒప్పుకోవటానికి రాహుల్ వర్గం సిద్ధం లేదంటున్నారు. మొత్తంగా.. సీనియర్లు.. జూనియర్ల మధ్య రచ్చతో కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం అట్టుడికిపోయిందని చెబుతున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా వైఫ్యలాల మీద ఫోకస్ పెట్టకుండా.. ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవటం పార్టీకి ఏ మాత్రం మేలు చేయదన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు మిస్ అవుతున్నట్లు..?