నారా లోకేష్ కూడా మొదలెట్టాడు

Lokesh

సోషల్ మీడియా పవరేంటో మన నాయకులందరికీ బాగానే అర్థమవుతున్నట్లుంది. ఇందులో జనాల సమస్యలు తమ దృష్టికి వచ్చినపుడు వెంటనే స్పందించి సాయం చేసే ప్రయత్నం చేస్తే తమకు మంచి గుర్తింపు వస్తుందని.. తమ ఇమేజ్ పెరుగుతుందని నాయకులు అర్థం చేసుకుంటున్నారు.

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల రామారావుకు సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది ఇలాగే. ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే కేటీఆర్.. తనను ట్యాగ్ చేస్తూ ఎవరు ఏ సమస్యను విన్నవించినా స్పందిస్తుంటారు. మంత్రి హోదాలో వారికి అభయం ఇస్తుంటారు. సత్వర సాయం అందేలానూ చూస్తుంటారు. ఇలా చేసే ఆయన చేతల మనిషిగా గుర్తింపు పొందారు. యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించారు. ఈ ఒరవడిని ఇప్పుడు మిగతా నాయకులూ అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ సైతం ఇటీవల ఇదే బాటలో నడుస్తుండటం విశేషం. సోషల్ మీడియాలో తనను ట్యాగ్ చేస్తూ ఎవరి కష్టం గురించైనా తెలియజేస్తే లోకేష్ స్పందిస్తున్నారు. తాజాగా ఓ తెలుగుదేశం కార్యకర్త అనారోగ్యం గురించి ట్విట్టర్లో తెలియజేస్తే అతడి బాధ్యత తాను తీసుకుంటానంటూ ముందుకొచ్చారు లోకేష్.

దీని కంటే ముందు ఏపీలో కరోనాపై పోరాడుతున్న జర్నలిస్టులకు బీమా చేయించే విషయంలోనూ లోకేష్ ఇలాగే స్పందించాడు. మొత్తానికి అధికారంలో ఉండగా అనేక విమర్శలు ఎదుర్కొని, గత ఎన్నికల్లో ఓడాక మరింత వ్యతిరేకత మూటగట్టుకున్న లోకేష్.. తనను తాను నాయకుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. తన భారీ అవతారం విషయంలో విమర్శల్ని గుర్తించి ఈ మధ్య లోకేష్ బాగా బరువు తగ్గడం, అలాగే ప్రసంగాల్లో తప్పుల మీద కసరత్తు చేసి ఇటీవల మెరుగ్గా మాట్లాడుతుండటం తెలిసిందే.