కరోనా టెస్టుకు శాంపిల్ ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారట

దేశంలో కరోనా కేసులు, మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 48,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా…మొత్తం కరోనా కేసుల సంఖ్య 13లక్షలు దాటింది. గత 24 గంటల్లో 757 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా…ఇప్పటివరకు మొత్తం 31,358 మంది కరోనాధాటికి మృత్యువాతపడ్డారు.

నిన్న ఒక్కరోజే దాదాపు 4లక్షలకు పైగా శాంపిల్స్ పరీక్షించారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఏపీలో నిన్న ఒక్క రోజే 48 వేలకపైగా టెస్టులు చేయగా 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో 15వేలకు పైగా టెస్టులు చేయగా….16 వందలకు పైగా కేసులు నమోదయ్యాయి. రోజూ ఇన్నివేల టెస్టులు చేస్తున్నా….దేశంలో ఈ రకంగా కేసుల సంఖ్య భయంకరంగా పెరగడం వెనుక కొంతమంది నిర్లక్ష్యం కూడా ఉందన్న వాదన వినిపిస్తోంది.

కరోనా టెస్టు చేయించుకున్న తర్వాత…తమ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి జనంలో కలిసిపోయి తిరుగుతున్నారని, అటువంటి వారి వల్ల కేసులు మరింత ఎక్కువవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా తీవ్రత పెరుగుతుండడంతో టెస్టుల సంఖ్యను ఇరు తెలుగు రాష్ట్రాలు పెంచాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. కరోనా లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలని….రిజల్ట్ వచ్చేవరకు హోమ్ ఐసోలేషన్,లేదా క్వారంటైన్ సెంటర్లో ఉండాలని సూచిస్తున్నాయి.

కరోనా టెస్టు చేసిన తర్వాత ఫలితం రావడానికి ఆయా జిల్లాలను బట్టి 1-3 రోజులు పడుతోంది. అంతవరకు టెస్టులు చేయించుకున్న వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. క్వారంటైన్ లేని చోట హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నారు. అయితే, కొందరు ప్రబుద్ధులు కరోనా టెస్టు చేయించుకున్న తర్వాత తమ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసుకొని అడ్రస్ లేకుండా పోతున్నారట.

ఏపీలో ఒక్క తిరుపతిలోనే 236 మంది కనిపించకుండా పోయారని, మొత్తం ఏపీలో ఈ సంఖ్య 1000 వరకు ఉండవచ్చని అంచనా. ఇక, హైదరాబాద్ లో 2500 మంది వరకు ఈ రకంగా కరోనా అనుమానితులను తెలిసి కూడా జనాల్లో కలిసి తిరుగుతున్నారట. ప్రభుత్వానికి ప్రజలు సహకరించనంత కాలం కరోనాను అరికట్టలేమని, కొంతమంది ప్రజల బాధ్యతారాహిత్యం వల్లే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు.

చాలామంది ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేయడం వంటి వాటిలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు. ఇటువంటి వారి వల్లే కరోనా టెస్టుకు ఆధార్ నంబర్ తప్పనిసరి అని ఐసీఎంఆర్ నిబంధన విధించిందని, దీని వల్ల కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి ఆధార్ నంబర్ లేని వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని చెబుతున్నారు.