మొండితనం కొంతవరకే మంచిది !

విషం ప్రాణాల్ని తీస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో విషాన్ని సరైన పద్దతుల్లో వినియోగిస్తే.. సంజీవినిలా మారి ప్రాణాల్ని రక్షిస్తుంది. చాలామంది వేలెత్తి చూపించే గుణాలు కొన్నిసార్లు ఆభరణాలుగా మారతాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ విషయంలోనూ అలానే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడ్ని కాదని.. జగన్ ను ఏపీ ప్రజలు ఎందుకంతగా అక్కున చేర్చుకున్నారు? ఎన్నికల్లో ఆయనకు కట్టబెట్టిన చారిత్రక విజయాన్ని సింపుల్ గా తీసి పారేయలేం. ఎందుకంటే.. మూర్తీభవించిన మొండితనం.. తన లక్ష్యసాధన కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు వెనక్కి తగ్గని తీరు ఆయనకు ఆభరణాలుగా మారాయి.

అదే.. ఆయన్ను అందరిలోనూ భిన్నమైన వ్యక్తిగా మార్చింది. అప్పటివరకూ తండ్రి చాటున ఉన్న కుర్రాడు.. అనుకోని రీతిలో తండ్రి కాలం చేసిన సమయంలో తమ కారణంగా దఖలు పడిన అధికారాన్ని తమ నుంచి దూరం చేయటాన్ని జీర్ణించుకోవటం కష్టం. అలా అని కొండ లాంటి సోనియా గాంధీని ఎదుర్కోవటం చిన్న విషయం కాదు. అయినప్పటికీ తనది అనుకున్న దాని కోసం జగన్ కోట్లాడిన తీరే ఆయన్ను కోట్లల్లో ఒకడిగా చేసింది.

వైఎస్ కొడుకన్న అభిమానానికి విలక్షణ వ్యక్తిత్వం తోడైతే.. ఫలితం ఎలా ఉంటుందన్న దానికి 2019 ఎన్నికల ఫలితాల్ని నిదర్శనంగా చూపిస్తారు. అన్ని సందర్భాల్లోనూ ఆభరణంగా ఉండే లక్షణాలు అక్కరకు రావన్నది నిజం. ఈ విషయాన్ని జగన్ మర్చిపోయినట్లున్నారు. ప్రాణాల్ని కాపాడే విషం.. ప్రాణం మీదకు తెస్తుందన్నది మర్చిపోకూడదు. వ్యక్తులతో పోరాడే సమయంలో మొండితనం పలువురిని ముచ్చట పడేలా చేస్తుంది. కానీ.. అదే మొండితనం వ్యవస్థల విషయంలోనూ.. నిబంధనల్ని అమలు చేసే విషయంలో పట్టనట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆ విషయాన్ని జగన్ మిస్ అవుతున్నట్లున్నారు.

నిమ్మగడ్డ విషయంలో మొదట్నించి జగన్ సర్కారుకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఏపీ సీఎం మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఏది ఏమైనా తన నిర్ణయం అమలు కావాల్సిందేనన్న మంకు పట్టు అంత మంచిది కాదు. తీర్పు చెప్పిన న్యాయమూర్తుల్ని భయభ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యలు చేసిన వారిని ఉపేక్షించటం సరికాదు. ఇలాంటి తీరును పాలకులు చూసిచూడనట్లుగా వ్యవహరించటం తప్పే అవుతుంది.

నిమ్మగడ్డ విషయంలో సుప్రీంకు వెళ్లటం ద్వారా జగన్ ఏం సాధించాలనుకున్నారో కానీ.. ఇప్పుడు ఏకంగా న్యాయమూర్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు.. వారిపై తీసుకున్న చర్యల సంగతేమిటి? ముందు ఆ వివరాల్ని వెల్లడించాలని చెప్పటం చూస్తే..జగన్ మొండితనం రానున్న రోజుల్లో ఎక్కడి వరకు వెళుతుందన్నది ప్రశ్నగా మారక మానదు.