మరో ఘనత సాధించిన అంబానీ

ప్రపంచ కార్పొరేట్ సామ్రాజ్యంలో ఇటీవల కాలంలో మరెవరూ లేనంత జోరును ప్రదర్శిస్తున్నారు రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ. ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బకు అందరూ ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. అందుకు భిన్నంగా సంక్షోభ సమయాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని వడివడిగా అడుగులు వేస్తూ.. విపరీతమైన వేగంతో దూసుకెళుతున్నారు. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం కంపెనీకి రుణాలు లేకుండా చేసిన ఆయన.. తాజాగా తన సంపదను విపరీతంగా పెంచుకుంటున్నారు.

తాజాగా ఆయన ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో మరో అడుగు ముందుకేశారు. ఫోర్భ్స్ రియల్ టైం రిచ్ లిస్టులో ఆయన ర్యాంకింగ్ మరింత మెరుగుపడింది. తాజాగా ఆయన ఐదో స్థానానికి ఎగబాకారు. బుధవారం ఆయన సంపదన 7501 కోట్ల డాలర్లు.. అంతే మన రూపాయిల్లో 5.61లక్షల కోట్లకు దూసుకెళ్లారు.

ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు కమ్ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ అధిపతి జెఫ్ బేజోస్ 18,490 కోట్ల డాలర్ల నెట్ వర్త్ తో ఆగ్రస్థానంలో ఉంటే.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ 11,350 కోట్ల డాలర్లతో రెండో స్థానంలో ఉన్నారు.

లూయిస్ విట్టన్ ఛైర్మన్ కమ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ మూడో స్థానంలో నిలిచారు. ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకులు కమ్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ 8,790 కోట్ల డాలర్లలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత ఉన్నది మన ముకేశ్ అంబానీనే. ఇటీవల కాలంలో రిలయన్స్ జియో చేసుకున్న ఒప్పందాలతో సంస్థ షేర్లు రికార్డు స్థాయిలో ర్యాలీ సాధిస్తోంది.

దీంతో.. ముకేశ్ వ్యక్తిగత సంపదన అనూహ్యంగా పెరుగుతోంది. తాజాగా దూసుకెళ్లిన ఆయన సంపదతో అపర కుబేరులుగా చెప్పే వారెన్ బఫెట్.. టెస్లా అధిపతి ఎలాన్ మాస్క్.. గూగుల్ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ లాంటి వారిని తోసి ముందుకు వెళ్లిపోవటం విశేషం. తాజాగా కంపెనీ విలువ రూ.13లక్షల కోట్లను దాటింది.