కరోనా…16 రోజుల్లో ఒకే కుటుంబంలోని ఆరుగురి మృతి

మానవత్వంతో పాటు కాస్త అప్రమత్తత లేకుంటే కరోనాబారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపిన ఘటన జార్ఘండ్ లో జరిగింది. అనారోగ్యం బారినపడి చనిపోయిన తమ తల్లి అంత్యక్రియలను నిర్వహించిన ఐదుగురు కొడుకులు కరోనాతో మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఆమెకు కరోనా ఉందని తెలిసింది. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ ఐదుగురు మరణించారు.

కరోనాతో ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్‌లో చర్చనీయాంశమైంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కాట్రాస్‌కు చెందిన 88 ఏళ్ల మహిళ ఢిల్లీలోని తన కొడుకు దగ్గర ఉండేది. ఓ పెళ్లిలో పాల్గొనేందుకు జూన్ చివరిలో ధన్‌బాద్ వెళ్లిన ఆ మహిళ… కాట్రాస్‌లోని స్వగ్రామానికి వెళ్లింది. అక్కడ అనారోగ్యం పాలైన ఆమె బొకారోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూలై 4న కన్నుమూసింది. అప్పటికే ఆమెకు కరోనా సోకింది. అయితే, ఆ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి గానీ, కుటుంబ సభ్యులకు గానీ తెలీదు. ఆమెది సాధారణమరణంగా భావించిన ఆమె ఐదుగురు కొడుకులు…ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండానే ఆమె అంత్యక్రియలను సంప్రదాయబద్ధంగా నిర్వర్తించారు. అంత్యక్రియలు పూర్తయిన కొద్ది రోజులకు ఆమె కరోనా సోకి మరణించిందని తేలింది. దీంతో, ఆమె ఐదుగురు కొడుకులు కూడా కరోనా బారినపడ్డారు.

జులై 4 నుంచి జూలై 20 మధ్యలో ఆ ఐదుగురు… ఒక్కొక్కరిగా మృత్యువాత పడ్డారు. ఈ అయిదుగురి వయసూ 60 ఏళ్ల పైనే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ మహిళ సంతానంలో ఢిల్లీలో ఉన్న కొడుకు ఒక్కడే మిగిలాడు. 16 రొోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ఆరుగురు చనిపోవడంతో ధన్ బాద్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం అధికారులు ధన్‌బాద్‌ను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కరోనా కాలంలో చనిపోయిన వారి అంత్యక్రియల్లో పాల్గొనేటపుడు అన్ని జాగ్రత్తలు పాటించాలని, సాధారణ మరణమైనా…జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించడం మేలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, కరోనా టెస్టుల ఫలితాల వెల్లడిలో అవుతున్న జాప్యం వల్ల కూడా ఈ తరహా మరణాలు సంభవిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.