అంధుడిని బస్సెక్కించిన సుప్రియకు ఇల్లే గిప్టిచ్చిన యజమాని

చేసిన పాపం చెప్తే పోతుంది
చేసిన మంచి చెప్పకుంటే ఫలిస్తుంది
గుర్తుందా… సరిగ్గా 10 రోజుల క్రితం బస్సు కోసం వెళ్తున్న ఒక అంధుడి కోసం ఒక మహిళ పరుగెత్తి బస్సును ఆపి అంధుడిని ఎక్కించి పంపిన వీడియో గుర్తుందా? దేశమంతా ఆ వీడియో వైరల్ అయ్యింది. నిస్వార్థంగా ఆమె చేసిన మంచి పనికి ఇల్లు గిఫ్టుగా వచ్చింది. అద్భుతం కదా.

ఆ చిరుద్యోగి పేరు. సుప్రియ. కేరళలోని తిరుపత్తూర్ జిల్లా పరిధిలోని తిరువల్లూరు ఆమె స్వంతూరు. అదే ఊర్లో జోయ్ ఆలుక్కాస్ లో పనిచేస్తున్నారు. చిరుద్యోగి. విధులకు వెళ్లే సమయంలో ఒక అంధుడు బస్సు కోసం ప్రయత్నించడం గమనించారు సుప్రియ. బస్సు అతడిని పట్టించుకోకుండా వెళ్లిపోవడం చూసి పరుగెత్తి బస్సును ఆపారు. అనంతరం ఆ అంధుడిని తీసుకొచ్చి ఎక్కించింది. తర్వాత తన దారిన తాను పోయింది.


బస్సు ఆపిన చోటులో పక్కనే ఉన్న ఓ భవనం పై నుంచి ఎవరో ఈ సంఘటనను వీడియో తీశారు. ఇది ఐపీఎస్ విజయ్ కుమార్ కు చేరింది. ఆయన ఆ వీడియోను పోస్టు చేస్తూ దయ కంటే మంచి ఏముంటుంది అంటూ కామెంట్ చేశారు. అది బాగా వైరల్ అయ్యి జోయ్ అలుక్కాస్ కంపెనీ యజమాని దృష్టికి వెళ్లింది.

దీంతో కంపెనీ యజమాని ఆమె మనసును గుర్తించి ఇంటికెళ్లి అభినందించారు. అదే ఆమె ఆనందానికి అవధుల్లేవు అన్నట్టు సంతోషపెట్టింది. ఓ చిన్న ఇరుకైన అద్దె ఇంట్లో ఉంటున్న విషయం తెలుసుకున్న యజమాని మరుసటి రోజు ఆమెను త్రిస్సూర్ కి రమ్మని పిలిచారు. అక్కడికెళ్లాక ఏకంగా ఒక ఇల్లు గిఫ్టుగా ఇచ్చాడు. ఆమె సంతోషం పట్టలేక కన్నీరు పెట్టుకుంది. ఈ సంఘటన మనకు ఓ స్ఫూర్తి. మనం చేసే సాయం ఫొటోలు వీడియోలు తీసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు గమనిస్తాడు. భగవద్గీతలో చెప్పినట్లు మనం కర్మ చేయాలి. ఫలితం భగవంతుడికి వదిలేయాలి. అది ఇంత అందంగా, అద్భుతంగా ఉంటుంది.