ట్వీటు వీరులు…. ఈ పొలిటిషియన్లు

రాజుల కాలంలో ఒక ఊరి నుంచి మరొక సమాచారం చేరాలంటే పావురాలను ఆశ్రయించేవారు. కాల క్రమేణా సమాచార విప్లవం పుణ్యమా అంటూ ఇపుడు అరచేతిలో ఇమిడిపోయిన స్మార్ట్ ఫోన్ లో కావాలసినంత సమాచారం దొరుకుతోంది. ఇక, సమాచారం చేరవేయడానికి అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు పోటీపడుతున్నాయి. వాటిలో అత్యంత ప్రజాదరణ కలిగిన సమాచార మాధ్యమం ట్విట్టర్. రాజుల కాలం నుంచి స్ఫూర్తి పొందిన ట్విట్టర్ నిర్వాహకులు తమ సంస్థ గుర్తుగా ఓ పక్షినే పెట్టుకున్నారు. ఈ ట్విట్టర్ పిట్ట సందేశం చిన్నదే అయినా కూత మాత్రం ఘనమే.

అందుకే, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ చిట్టి పొట్టి సందేశాలు పంపుతూ సోషల్ మీడియాలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మంత్రి కేటీఆర్, జనసేనాని పవన్ కల్యాణ్, మహేష్ బాబు…ఇలా చాలా మంది రాజకీయ, సినీ ప్రముఖులు ట్విట్టర్లో కోట్లాదిమంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

గతంలో మాదిరిగా ఒక ముక్క…అర ముక్క వార్తలకు ప్రెస్ మీట్లు పెట్టే పనిలేకుండా ….మూడు ముక్కల్లో చెప్పాలనుకున్నది ట్వీట్ చేస్తున్నారీ స్వీట్ ట్వీట్ వీరులు.

రాజకీయ, సినీ ప్రముఖులలో చాలామంది ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ…తమ కార్యకర్తలు, అభిమానులతో టచ్ లోకి వస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలకైతే ఏకంగా ఓ టీం ట్వీట్లను వండి వారస్తుంది. సమకాలీన, రాజకీయ విషయాలపై సదరు సెలబ్రిటీల అభిప్రాయాన్ని తెలుసుకొని శరవేగంగా ట్వీట్ చేయడమే ఈ టీమ్ల పని.

భారత్ లో ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లున్న నేత ప్రధాని నరేంద్ర మోడీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పోటీ పడుతున్న మోడీ….ఒక్కోసారి ఆయనను బీట్ చేస్తున్నారు కూడా. రాహుల్‌గాంధీ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణలో మంత్రి కేటీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. సినీతారల్లో ప్రిన్స్ మహేష్ సినీతారల్లో అగ్రస్థానంలో ఉన్నారు.

ప్రధాని మోడీకి ట్విట్టర్లో 5 కోట్ల 98 లక్షల 13 వేల 243 మంది ఫాలోవర్లున్నారు. రాహుల్‌గాంధీకి ఒక కోటి 51 లక్షల 91 వేల 675 మంది, మహేష్‌బాబుకు ఒక కోటి 10 లక్షల 97 వేల 519 మంది ఫాలోవర్లున్నారు. ఇక, చంద్రబాబునాయుడుకు 47 లక్షల 25వేల 886 మంది, పవన్ కల్యాణ్‌ను 40 లక్షల 23 వేల 515 మంది, కేటీఆర్ కు 24 లక్షల 65 వేల మంది, ఏపీ సీఎం జగన్‌కు 16 లక్షల 78 వేల 933 మంది ఫాలోవర్లున్నారు.

కల్వకుంట్ల కవితను 9 లక్షల 76 వేల 364 మంది, తెలంగాణ మంత్రి హరీష్‌రావును 9 లక్షల 22 వేల 481 మంది, టీడీపీ యువ నేత నారా లోకేష్‌ను 7 లక్షల 82 వేల 933 మంది, చిరంజీవిని 5 లక్షల 94 వేల 281 మంది, విజయసాయిరెడ్డిని 3 లక్షల 85 వేల 241 మంది ఫాలో అవుతున్నారు.

ఇక, వీరందరిలోకి ట్విటర్లో ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ట్వీట్లకు రీట్వీట్లు చేసే నేత కేటీఆర్. ఆ తర్వాతి స్థానం విజయసాయిరెడ్డిది. ముఖ్యంగా కేటీఆర్ కు హైదరాబాద్ నగర వాసులు తమ సమస్యలను ట్వీట్ల ద్వారానే విన్నవించి పరిష్కరించుకున్న ఘటనలు అనేకం. ఇక, ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్ , టీడీపీపై విజయసాయి ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తుంటారు.