ఆయన్ను పిలిపించుకొని మాట్లాడిన జగన్.. అసలేం జరిగింది?

ఒక్కో ముఖ్యమంత్రి తీరు ఒక్కోలా ఉంటుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఎవరికి సంబంధించిన వార్త పబ్లిష్ అయ్యాక.. అలాంటి వారిని ముఖ్యమంత్రులు పక్కన పెట్టేయటం సాధారణంగా జరుగుతుంది. అందులోకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి వారైతే.. ఇక వారివైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడరని చెబుతారు. అలాంటి తీరుకు భిన్నమైన అంశం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఏరి కోరి తెచ్చుకొని సీఎంవోలో పెట్టుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ కు సంబంధించిన అంశం ఇటీవల ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

తాను కోరి తెచ్చుకున్న ముగ్గురు రిటైర్డు సీనియర్ ఐఏఎస్ అధికారులకు కేటాయించిన సబ్జెక్టులను ఆకస్మికంగా తొలగించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి ఎందుకిలా చేశారన్న ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి. ఇదే సమయంలో సబ్జెక్టులు తొలగించిన ముగ్గురు అధికారుల్లో అజయ్ కల్లంకు మాత్రం ఫైళ్లు యథావిధిగా వెళ్లటం మిగిలిన ఇద్దరికి ఎలాంటి ఫైళ్లు వెళ్లని వైనంపై వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి.

కోరి తెచ్చుకున్న అధికారులకు ఇలా జరగటం ఏమిటి? అన్న ప్రశ్న వ్యక్తమైంది. దీనికి తోడు పీవీ రమేశ్ దళిత నేపథ్యం ఉన్న అధికారి కావటం.. ముక్కుసూటితనం ఎక్కువ కావటం కూడా మీడియాలో వార్తలుగా వచ్చాయి. ఇలాంటివేళ.. తాజాగా ముఖ్యమంత్రి జగన్.. పీవీ రమేశ్ తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వార్తలు వచ్చిన వారిని కలవటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలుసుకునేందుకు అస్సలు ఇష్టపడరన్న మాట తరచూవినిపిస్తూ ఉంటుంది. అందుకుభిన్నంగా తనకు తానే పీవీ రమేశ్ ను సీఎంను పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.

తమ సమావేశంలో భాగంగా గతంలో ఆయన చూసిన సబ్జెక్టుల్ని యథావిధిగా చూడాలని కోరారని చెబుతున్నారు. జరిగిన విషయాల్ని పట్టించుకోవద్దని.. తన వరకు రాకుండానే జరిగినట్లుగా సీఎం జగన్ చెప్పినట్లు తెలిసింది. మనసులో ఏమీ పెట్టుకోకుండా గతంలో మాదిరి పని చేయాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి పీవీ రమేశ్ ఓకే చెప్పారంటున్నారు. ఏమైనా.. తాజా ఉదంతం మాత్రం రోటీన్ కు భిన్నమంటున్నారు.