తేజు కోసం చిరు ఓకే చేసిన క‌థ‌

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చే ఏ యువ క‌థానాయ‌కుడైనా చిరంజీవి అండ‌దండ‌ల‌తోనే ఇండ‌స్ట్రీలోకి అడుగు పెడ‌తాడు. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణలోనే సినిమాలు చేస్తాడు. ముఖ్యంగా త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మీద చిరు ప్ర‌త్యేకంగా దృష్టిసారిస్తార‌ని అంటారు. మ‌ధ్య‌లో వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో తేజ్ కెరీర్ గాడి త‌ప్పిన నేప‌థ్యంలో ఈ మ‌ధ్య ఆయ‌న అత‌డి విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త ప‌డుతున్నారు. ఆయ‌న ఆమోద ముద్ర ప‌డ‌కుండా ఏ క‌థా ప‌ట్టాలెక్క‌డం లేదు. చిత్ర‌ల‌హ‌రి, ప్ర‌తి రోజూ పండ‌గే, సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌ చిత్రాల‌తో పాటు దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో తేజు మొద‌లు పెట్టిన కొత్త సినిమా క‌థ కూడా చిరు విని ఓకే చేసిన‌వే అని స‌మాచారం.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి తేజు కోసం చిరు మ‌రో క‌థ విని పచ్చ జెండా ఊపార‌ట‌. చిరు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ట‌లో ఒక‌టైన ఠాగూర్ సినిమాను నిర్మించిన ఠాగూర్ మ‌ధు.. తేజుతో ఓ సినిమా ప్రొడ్యూస్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. గోపాల్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ప‌ట్టుకొచ్చిన భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా అనే క‌థ‌తో తేజు సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. కాన్సెప్ట్ కొంచెం కొత్త‌గా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ క‌థ‌కు ముందు తేజు ఓకే చెప్ప‌గా.. త‌ర్వాత అది చిరు ద‌గ్గ‌రికి వెళ్లింది. ఆయ‌న విని ట్రాజిక్ ఎండ్ కాకుండా క‌థ‌ను సుఖాంతం చేయాల‌ని చెప్ప‌గా.. ఆ మేర‌కు మార్పు చేశార‌ట‌. ఇది త‌క్కువ బ‌డ్జెట్లో ప‌రిమిత కాస్ట్ అండ్ క్రూతో తెర‌కెక్కాల్సిన సినిమా అని.. భారీత‌నం ఉన్న దేవా సినిమాను ఇప్పుడిప్పుడే చిత్రీక‌రించ‌డం క‌ష్టం కాబ‌ట్టి ముందు ఈ సినిమాను తేజు మొద‌లుపెట్టే అవ‌కాశాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం.