చిన్న సినిమాతో పరిచయం.. పెద్ద రేంజికే

Venu-Udugula

సినీ రంగంలోకి ఎన్నో కలలతో వచ్చే అందరికీ అవకాశాలు అందవు. ఐతే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం వెనుదిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఎన్నో కష్టాలు పడి.. ఇండస్ట్రీలో కొంచెం నిలదొక్కుకుని.. ఎన్నో ఏళ్ల తర్వాత తొలి అవకాశం అందుకుని.. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న చాలామంది ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నవాళ్లే.

ఇప్పుడు పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్నా వాళ్లందరూ ఒకప్పుడు ఇలా కష్టపడ్డవాళ్లే. తొలి సినిమాతో ప్రతిభ చాటుకున్నాక వాళ్లకు తిరుగులేక పోయింది. యువ దర్శకుడు వేణు ఉడుగుల జీవితం కూడా తొలి సినిమా ‘నీదీ నాదీ ఒకే కథ’ తర్వాత మారిపోతున్నట్లే కనిపిస్తోంది. ఆ సినిమా మరీ పెద్ద హిట్టేమీ అయిపోలేదు. కానీ విమర్శకుల ప్రశంసలందుకుంది. వేణు సత్తా ఏంటో సినీ ప్రపంచానికి చాటింది.

ఈ సినిమా తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్లో ‘విరాటపర్వం’ సినిమా చేస్తున్నాడు వేణు. ఆసక్తికర కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. సినిమా ఔట్ పుట్ చూశాక సురేష్ బాబుకు వేణుపై మంచి గురి కుదిరి.. ఇండస్ట్రీ జనాలకు అతడి గురించి చెబుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అల్లు అరవింద్.. ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేసి పెట్టమని వేణును అడిగితే అతను దిగ్గజ రచయిత చలం రాసిన ఓ కథతో ఓ సిరీస్ రూపొందించే పనిలో ఉన్నాడు.

అలాగే లాక్ డౌన్ టైంలో వేణు 1995లో జరిగిన వాస్తవ ఘటనలతో ఓ కథ తయారు చేయగా.. 14 రీల్స్ సంస్థ దాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. ఈ కథను ఓ పెద్ద హీరోతో చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళంలో ‘నాదీ నీదీ ఒకే కథ’ చిత్రాన్ని ధనుష్ హీరోగా రీమేక్ చేసే అవకాశం వచ్చినా.. వద్దనుకుని రెండో చిత్రం స్ట్రెయిట్ మూవీ చేయాలని వేణు ఇక్కడే ఉండిపోవడం విశేషం. మొత్తానికి వేణు ఉడుగుల టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది.