ప్రభాస్ చెల్లెలు.. గ్రాండ్ ఎంట్రీ

రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణం రాజు నట వారసత్వాన్నందుకుని ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అతడి అరంగేట్రం మామూలుగానే జరిగింది. కెరీర్లో కొన్నేళ్లు మీడియం రేంజ్ హీరోగానే ఉన్నాడు ప్రభాస్. తర్వాత స్టార్ అయ్యాడు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయాడు.

ప్రభాస్ కాకుండా కృష్ణం రాజు కుటుంబం నుంచి ఇంకెవ్వరూ తెరంగేట్రం చేయలేదు. ప్రభాస్ తండ్రి సూర్యానారాయణ రాజు ఇంతకు ముందు కృష్ణం రాజు నిర్మించిన సినిమాల ప్రొడక్షన్ చూసుకున్నారు. ఇంతకుమించి ఎవ్వరూ ఈ ఫ్యామిలీ నుంచి సినీ రంగంలోకి రాలేదు.

ఐతే ఇప్పుడు కృష్ణం రాజు కుటుంబం నుంచి ఓ కొత్త వ్యక్తి సినీ రంగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆ వ్యక్తి పేరు ప్రసీద. ఈమె ప్రభాస్ చెల్లెలు, కృష్ణం రాజు పెద్ద కూతురు కావడం విశేషం.

కృష్ణం రాజుకు కొడుకుల్లేరు. ముగ్గురు కూతుళ్లున్నారు. వారిలో పెద్దమ్మాయి ప్రసీద. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన కొన్ని వేడుకల్లో, ఇతర కార్యక్రమాల్లో ప్రసీదను సినీ అభిమానులు చూసే ఉంటారు. ఈ అమ్మాయి ప్రభాస్ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’తో నిర్మాతగా అరంగేట్రం చేస్తోంది. ఈ రోజే రిలీజైన ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ పోస్టర్లో నిర్మాతలుగా ‘యువి క్రియేషన్స్’ అధినేతలు వంశీ, ప్రమోద్‌లతో పాటు ప్రసీద పేరు కూడా పడింది.

పోస్టర్ మీద యువి కంటే ముందు గోపీకృష్ణ మూవీస్‌ బేనర్‌ పేరును ఎడమ వైపు వేశారు. కృష్ణం రాజు పేరు సమర్పకుడిగా పడింది. నిర్మాతగా ప్రసీదను ప్రకటించారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిందో తెలిసిందే. అతనిప్పుడు పాన్ ఇండియా స్టార్. తన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లోనే తెరకెక్కుతున్నాయి. ఇలాంటి భారీ చిత్రంతో ప్రభాస్ చెల్లెలు నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం విశేషమే.