నేను బాగున్నా.. పాటలు కూడా రాస్తున్నా

కొంచెం వయసు మీద పడ్డ, అనారోగ్యంతో ఉన్న సెలబ్రెటీల్ని బతికి ఉండగానే చంపేయడం.. లేదంటే వారి ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు పుట్టించడం సోషల్ మీడియాకు మహా సరదా. ఇలా ఎంతమందిని బతికుండానే నివాళులు అర్పించేశారో లెక్కలేదు. దిగ్గజ గాయని జానకి సహా చాలామంది పెద్ద వాళ్లకు ఇలాంటి అనుభవాలున్నాయి. ఈ మధ్య లెజెండరీ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యం గురించి కూడా రకరకాల వార్తలు వచ్చాయి.

ఐతే ఆయన లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న సంగతి నిజమే అంటూ ఆయన మేనల్లుడు ఉత్తేజ్ స్వయంగా వెల్లడించాడు. సర్జరీ జరిగాక ఆయన బాగానే ఉన్నట్లు కూడా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఐతే తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. కాగా.. ఇటీవల మళ్లీ ఆయన ఆరోగ్యం గురించి రూమర్లు మొదలయ్యాయి.

శస్త్రచికిత్స విజయవంతం కాలేదని.. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై సుద్దాల అశోక్ తేజ స్వయంగా స్పందించారు. ఒక వీడియో ద్వారా తాను ఆరోగ్యంగానే ఉన్నానని వెల్లడించారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని.. తాను పూర్తిగా కోలుకుంటున్నానని.. మామూలు స్థితిలోనే ఉన్నానని ఆయన వెల్లడించారు. అంతే కాదు.. తాను మళ్లీ పాటలు కూడా రాస్తున్నట్లు చెప్పారు.

స్వయంగా వీడియోనే పెట్టడంతో సుద్దాల ఆరోగ్యం గురించి ఇలాంటి ప్రచారాలు కట్టిపెడితే మంచిది. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ గేయ రచయితల్లో సుద్దాల ఒకరు. చిరంజీవి సినిమా ‘ఠాగూర్’లో శ్రీశ్రీ కవిత్వ స్ఫూర్తితో ఆయన రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను..’ అంటూ సుద్దాల రాసిన పాటకు జాతీయ అవార్డు దక్కడం విశేషం. ఇంకా మరెన్నో పురస్కారాలు ఆయన్ని వరించాయి.