ముంచేశారు అంటున్న కుంచే సారు!

నిన్న జీ5లో రిలీజ్ అయిన 47 డేస్ చిత్రం బాలేదని విమర్శకులు తేల్చేసారు. అయితే సదరు చిత్రానికి సంగీతం అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామ్యం తీసుకున్న రఘు కుంచె రివ్యూ రైటర్స్ మీద తన అసహనం వ్యక్తం చేస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ లో ఉన్న పది రూపాయల సినిమాలు చూసి, వాటితో పోల్చి తన రూపాయి సినిమా బాలేదని అంటున్నారని పరుషంగానే మాట్లాడాడు. ఇదే సినిమా థియేటర్లలో విడుదల అయి వుంటే ఈ రివ్యూల వల్ల ఈపాటికి దుకాణం సర్దేసి ఉండేదని, ఓటిటీ కావడం వల్ల రివ్యూలతో సంబంధం లేకుండా చూస్తున్నారని చెప్పాడు.

అంతేకాదు సగటు ప్రేక్షకులకు నచ్చుతోందని కూడా సెలవిచ్చాడు. తన సినిమా బాగుందని నిర్మాత అనుకోవడంలో తప్పు లేదు. లేదంటే అసలు డబ్బులే పెట్టడు కదా? కానీ అదేదో బాగున్నా సినిమాను బాలేదని అనేస్తున్నట్టు భోరుమనడమే బాలేదు. ఆయన చెప్పినట్టే సినిమా థియేటర్ కు వెళ్లిన వాడికి… తెరపై ఒకటే సినిమా వేస్తారు, నచ్చినా, నచ్చకపోయినా. కానీ ఓటిటీలో చూసే ప్రేక్షకుడికి బోలెడు ఆప్షన్లు. వాళ్ళు రిమోట్ జోలికి పోకుండా సినిమా అయ్యే వరకు చూడాలంటే మాములుగా కంటే ఎక్కువ కష్టపడి కంటెంట్ రూపొందించాలి. ఒకవేళ నెట్ ఫ్లిక్స్ కంటెంట్ తో పోల్చి తెలుగు సినిమాలు బాలేదని అంటున్నారనేది నిజమే అయితే… కృష్ణ అండ్ హిజ్ లీల కూడా ఓటిటీలోనే రిలీజ్ అయింది. మరి దాన్ని ఎవరూ తీసిపడేయలేదే?