ఫిలిం సిటీ గురించి ఆ వార్త నిజం కాదట

రామోజీ ఫిలిం సిటీ గురించి కొన్ని రోజులుగా ఓ గట్టి ప్రచారం నడుస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆ స్టూడియోను ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ వాళ్లకు మూడేళ్ల కాలానికి లీజుకు ఇస్తున్నారని, ఈ డీల్ విలువ వేల కోట్లల్లో ఉంటుందని ప్రచారం జరిగింది. ఓ ప్రముఖ ఇంగ్లిష్ టీవీ ఛానెల్‌కు సంబంధించిన వెబ్ సైట్లో ముందుగా ఈ వార్త రావడం.. ఆ తర్వాత స్థానిక మీడియాలో ఈ వార్త హల్‌చల్ చేయడం తెలిసిన సంగతే. కరోనా వల్ల రామోజీ గ్రూప్ ఆర్థిక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేపథ్యంలో ఈ వార్త నిజమే అయి ఉంటుందని అంతా అనుకున్నారు. ఐతే రామోజీ రావుకు సన్నిహితులు, రామోజీ గ్రూప్‌లో ఉన్నత స్థాయి వాళ్లను సంప్రదిస్తే ఈ వార్త నిజం కాదని తేలింది. వేల మంది ఉద్యోగులు పని చేస్తున్న, తమ సొంత కార్యకలాపాలు ఎన్నో నడుస్తున్న ఫిలిం సిటీని వేరొకరికి లీజుకు ఇచ్చే ఉద్దేశం లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

లాక్ డౌన్ తర్వాత ఫిలిం సిటీ సహా రామోజీ గ్రూప్ అంతా నష్టాల్లో కూరుకుపోయిన మాట వాస్తవం. ఆదాయం లేకపోగా.. ఫిలిం సిటీ నిర్వహణకే కోట్లల్లో ఖర్చవుతోంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఐతే కొన్ని నెలలు ఈ కష్ట నష్టాల్ని భరిస్తే.. ఆ తర్వాత మునుపటి కన్నా ఎక్కువగా ఆదాయం వస్తుందని ఫిలిం సిటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంకో ఏడాది పాటు వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్లి షూటింగ్ చేసే పరిస్థితి లేదు. ఔట్ డోర్ షూటింగులూ కష్టమే. దీంతో స్టూడియోల్లో భారీ సెట్టింగ్స్ వేసుకుని చిత్రీకరణలు జరపాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో 1600కు పైగా ఎగరాల్లో విస్తరించిన ఫిలిం సిటీని మించిన లొకేషన్ ఇంకోటి ఎక్కడా కనిపించదు. కాబట్టి తెలుగు సినిమాల వాళ్లే కాదు.. ఇతర భాషల వాళ్లూ ఫిలిం సిటీనే ఆశ్రయిస్తారు. రాబోయే రోజుల్లో విపరీతంగా డిమాండ్ ఉంటుంది. అంత వరకు ఓపిక పడితే రాబోయే కొన్నేళ్లలో భారీగా ఆదాయం వస్తుందని రామోజీ అండ్ కో భావిస్తోందట. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్‌కు సంబంధించిన వేల మంది ఉద్యోగులు ఫిలిం సిటీ నుంచే పని చేస్తుండటం.. వ్యక్తిగత, వృత్తిగత భవనాలు, కార్యాలయాలెన్నో ఉన్న నేపథ్యంలో మరో సంస్థకు ఫిలిం సిటీని లీజుకు ఇవ్వడం రామోజీ కుటుంబానికి ఇష్టం లేదని సమాచారం.