కరోనా కా బాప్ కొరొనిల్ వైరల్ ట్వీట్స్

ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి వైరస్ ను తుదముట్టించే వ్యాక్సిన్ కోసం విశ్వప్రయత్నాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పట్టే అవకాశముండడంతో… కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు అందించే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను రూపొందించే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు, వైద్యులు. ఈ క్రమంలోనే ఫ్యాబి ఫ్లూ వంటి ట్యాబ్లెట్లను మన దేశంలో తయారు చేశారు.

ఇక, తాజాగా కరోనా చికిత్సలో తొలిసారిగా ఆయుర్వేదిక్‌ ఉత్పత్తులు ప్రవేశించాయి. కరోనాకు చికిత్స అందించేందుకు కొరోనిల్‌ను పతంజలి సంస్థ రూపొందించింది. కొరొనిల్ వాడిన తర్వాత 3 రోజుల్లో 69 శాతం మంది, 7 రోజుల్లో 100 శాతం మంది రోగులు కోలుకున్నారని, 14 రోజుల్లో కరోనాను కొరోనిల్ ఖతం చేస్తుందని వెల్లడించింది. తమ ఔషధం వాడితే నూరు శాతం రికవరీ రేటు, సున్నా శాతం మరణాల రేటు ఉంటుందని యోగా గురు బాబా రాందేవ్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొరోనిల్ పై ట్విటర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది.

కొరొనిల్ మరింత మంది రోగులపై పనిచేసి విజయవంతమైతే ఆయుర్వేద శాస్త్రంలో ఇదో మైలురాయని ట్విట్టర్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కొరొనిల్ కచ్చితత్వం నిర్ధారణ అయితే….కొరొనిల్ కోసం జనాలు పతంజలి స్టోర్ల ముందు క్యూ కడతారని కామెంట్స్ చేస్తున్నారు. ఆయుర్వేద దివ్య ఔషధం కొరొనిల్ సక్సెస్ అయితే ఫార్మా కంపెనీలకు దుర్గతి తప్పదని, మనం కనిపెట్టలేనిది పతంజలి ఎలా కనిపెట్టగలిగిందని ఫార్మా కంపెనీలు ఇరిటేట్ అవుతాయని మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు.

సబ్సే ఆగే హోగా హిందుస్తానీ అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ, శాస్త్రవేత్తలకు బాబా రాందేవ్ ఫోన్ చేస్తున్నట్లు సర్కాస్టిక్ గా పోస్ట్ లు పెడుతున్నారు. కొరొనిల్ దెబ్బకు కరోనా నిల్ కావాల్సిందేనని…కొరొనిల్ వచ్చిందని తెలిసిన కరోనా గుక్కపెట్టి ఏడుస్తోందని సెటైర్లు వేస్తున్నారు. కొరొనిల్ పై నెటిజన్ల ప్రశంసలు…సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.