బ్రేకింగ్: అచ్చెన్నాయుడు అరెస్టు..

Atchannaidu Kinjarapu

సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఏపీ మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత.. ఏపీ అధికారపక్షంపై అదే పనిగా విరుచుకుపడే ఫైర్ బ్రాండ్ అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకొంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి వచ్చిన ఆరోపణలపైన ఏసీబీ విచారణ చేస్తోంది.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిపై ఆరోపణలు ఉన్నట్లుగా చెబుతున్నారు. శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడు నివాసంలో ఉన్న ఆయన్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన్ను పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం నుంచి ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు.

మందుల కొనుగోళ్లలో రూ.900 కోట్లకు పైగా భారీ అక్రమాలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఇటీవల విజిలెన్స్ ఎన్ ఫోర్సుమెంట్ విడుదల చేసిన ఒక నివేదికలో ఈ విషయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోళ్ల సమయంలో రాష్ట్ర కార్మిక శాఖామంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన చొరవతోనే డైరెక్టర్లురూ.975 కోట్ల మందుల్ని కొనుగోలు చేయగా.. అందులో రూ.100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు రూపొందించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

మందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.293 కోట్లు బడ్జెట్ కేటాయిస్తే. రూ.698 కోట్లకు మందులు కొనుగోలు చేసినట్లుగా చూపించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు రూ.404 కోట్ల మేర నష్టం వాటిల్లేలా చేశారంటున్నారు. దీనిపై విచారణ జరుపుతున్న సమయంలోనే.. ఈ అరెస్టు చోటు చేసుకుంది.

ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ వ్యవహారంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది ఇప్పుడు టీడీపీకి పెద్ద సమస్యగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.