గంగూలీని సచిన్ ఏప్రిల్ ఫూల్ చేసిన వేళ..

Sachin

లాక్ డౌన్ వేళ సినిమా, స్పోర్ట్స్ సెలబ్రెటీలందరూ సోషల్ మీడియాలో లైవ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ పాత సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా చేరాడు.

తన కెరీర్లో ఒక సందర్భంలో సచిన్ టెండూల్కర్, ఇతర జట్టు సభ్యులు కలిసి తనను ఏప్రిల్ ఫూల్ ఎలా చేశారో.. తాను అప్పుడు విషయం తెలియక ఎంత సీరియస్ అయ్యానో వివరించాడు. పాకిస్థాన్‌తో ఓ సిరీస్‌లో తాను వరుస వైఫల్యాలు చవి చూస్తూ మూడ్ ఔట్‌లో్ ఉన్న సమయంలో ఆ సంఘటన జరిగినట్లు గంగూలీ తెలిపాడు. ఆ ఉదంతం గురించి గంగూలీ ఇంకా ఏమన్నాడంటే..

‘‘ఆ సిరీస్‌లో నేనే కెప్టెన్. కానీ సరిగా ఆడలేక ఇబ్బంది పడుతున్నా. ఆ బాధతో డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లాను. ఆ రోజు ఏప్రిల్ 1వ తేదీ అని నాకు గుర్తు లేదు. ఆ గదిలోకి వెళ్లగానే సచిన్, హర్భజన్, మరికొందరు నా దగ్గరికి వచ్చారు. మీడియాతో అలా అన్నావేంటి అన్నారు. ఏం అన్నాను అంటే.. జట్టు సరిగా ఆడట్లేదని, ఇలా ఆడితే ఎలా అని నేను మీడియా దగ్గర చెప్పినట్లు వాళ్లన్నారు. ఈ వ్యాఖ్యలతో తామంతా చాలా నిరాశ చెందామని అన్నారు. నేనలా అనలేదని అన్నా వినిపించుకోలేదు. నాకు చాలా కోపం వచ్చింది. నేనేమైనా తప్పు చేశానని మీరనుకుంటే కెప్టెన్సీకి రాజీనామా చేస్తా అని సీరియస్‌గా చెప్పేసి వెళ్లి కుర్చీలో కూర్చున్నా. వెంటనే సచిన్, హర్భజన్ గట్టిగా నవ్వుతూ ఏప్రిల్ ఫూల్ అన్నారు. అప్పటికి కానీ విషయం బోధపడలేదు. నా సహచరులకు నా పట్ల ఎంత ప్రేమ ఉందో ఆ రోజే అర్థమైంది. నేను మూడీగా ఉంటున్నానని, నన్ను ఉత్సాహపరచాలని వాళ్లు అలా చేశారు. నిజానికి ఆ సంఘటన తర్వాత నేను కుదురుకున్నా. ఫాంలోకి వచ్చి బాగా పరుగులు చేశా’’ అని గంగూలీ గుర్తు చేసుకున్నాడు.