ఆమెను దూరం పెట్టి.. ఆయ‌న‌ను ద‌గ్గ‌రికి తీసి!

క‌ర్నూలులో భూమా కుటుంబానికి ఎంతో పేరుంది. రాజ‌కీయంగా చూస్తే నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆళ్ల‌గ‌డ్డ కుటుంబానికి బ‌ల‌మైన ప‌ట్టు ఉంది. కానీ ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే టీడీపీ భూమా కుటుంబాన్ని దూరం పెట్టే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. అఖిల ప్రియ‌ను దూరం పెట్టి ఏవీ సుబ్బారెడ్డిని ద‌గ్గ‌రికి తీసేందుకు బాబు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఆళ్ల‌గ‌డ్డ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా నంద్యాల నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన భూమా నాగిరెడ్డి హ‌యాంలో క‌ర్నూరులో టీడీపీ బ‌ల‌మైన శ‌క్తిగా ఉండేది. కానీ 2017లో ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో ఆయ‌న కుమార్తె అఖిల ప్రియ ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. చంద్ర‌బాబు కూడా ఆమెన మంత్రిని చేశారు. కానీ రాజ‌కీయాల్లో మాత్రం ఆమె త‌న‌దైన ముద్ర చూపించ‌డంలో విఫ‌ల‌మయ్యార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. మంత్రి ప‌ద‌వి ఇచ్చినా ప‌ట్టు పెంచుకోవ‌డంలో ఆమె ఫెయిల్ అయ్యారు. త‌న వారంద‌రినీ దూరం చేసుకున్నారు. భూమా వ‌ర్గాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వారంతా మెల్ల‌గా ప‌క్క‌కు వెళ్లిపోయారు. కుటుంబంలోనూ పొర‌ప‌చ్చాలు ఉన్న‌యాని తెలిసింది. దీంతో భూమా సోద‌రుల కుమారులు బీజేపీలో చేరిపోయారు.

2019 ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత అఖిల‌ప్రియ మ‌రింతగా ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ముఖ్యంగా ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ అన్ని విష‌యాల్లోనూ జోక్యం చేసుకుంటుండటంతో భూమా వ‌ర్గం ఆగ్ర‌హంతో ఉంద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. పైగా భూమా నాగిరిడ్డి స‌న్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్య కుట్ర‌కేసు సంచ‌ల‌నంగా మారింది. త‌న బంధువైన మోహ‌న్ రెడ్డిపై హ‌త్యాయ‌త్నం కేసులో ఏవీ సుబ్బారెడ్డిని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇది ఎప్ప‌టికైనా అఖిల‌ప్రియ‌కు ఇబ్బందే అని టీడీపీ అధిష్టానం గుర్తించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు హైదరాబాద్‌లో భూమి విష‌యంలో కిడ్నాక్ కేసు కూడా అఖిల కుటుంబానికి చుట్టుకుంది.

ఈ ప‌రిస్థితుల్లో రాజ‌కీయంగా అఖిల‌ప్రియ ఇక ఎద‌గ‌డం క‌ష్ట‌మ‌ని ఆమెకు ప‌ట్టు దొర‌క‌ద‌ని బాబు భావించిన‌ట్లు సన్నిహితులు చెప్తున్నారు. అందుకే ఆమెను దూరం పెట్టాల‌నుకున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భూమా కుటుంబానికి ఒక టికెట్ ఇచ్చి ఏవీ సుబ్బారెడ్డికి మ‌రో టికెట్ ఇవ్వాల‌న్న‌ది బాబు ఆలోచ‌న‌గా తెలుస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే సుబ్బారెడ్డికి ప‌రోక్ష సంకేతాలు పంపిన‌ట్లు స‌మాచారం.