కనగరాజ్ నియామకంపై కేసు

జస్టిస్ కనగరాజ్ నియామకంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. 78 ఏళ్ళ వయసున్న జస్టిస్ కనగరాజ్ ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలీసు ఫిర్యాదుల అథారిటి ఛైర్మన్ గా నియమించింది. అంటే నియామకం జరిగి కూడా చాలా కాలమైంది. మరి పిటీషనర్ ఇంతకాలం ఏమి చేస్తున్నారో అర్ధం కావటంలేదు. ఎప్పుడో నియామకం జరిగితే ఇపుడు పిటీషన్ వేయటంలో అర్ధమేంటో పిటీషనరే చెప్పాలి. జస్టిస్ కనగరాజ్ ను నిబంధనలను విరుద్ధంగా ప్రభుత్వం అథారిటి ఛైర్మన్ గా నియమించినట్లు పిటీషనర్ ఆరోపించారు.

ఇంతకీ విషయం ఏమిటంటే పోలీసు ఫిర్యాదుల అథారిటి ఛైర్మన్ గా నియమితులయ్యే వ్యక్తికి 65 ఏళ్ళు దాటకూడదట. అంటే ఛైర్మన్ గా నియమితులైన వ్యక్తి 65 ఏళ్ళు దాటనంతవరకే ఛైర్మన్ గా వ్యవహరించాలని అథారిటి నిబంధనల్లోనే ఉందని పిటీషనర్ అంటున్నారు. మరి నియామకం నాటికే వయోపరిమితిని దాటిపోయిన కనగరాజును ప్రభుత్వం ఛైర్మన్ గా ఎలా నియమిస్తుందని పిటీషనర్ ప్రశ్నించారు.

పిటీషనర్ ప్రశ్నించినట్లు వయోపరిమితి నిబంధన నిజమే అయితే ప్రభుత్వం తప్పుచేసినట్లే అనటంలో సందేహంలేదు. వయసు పరిమితి దాటిపోయిన కనగరాజ్ ను నియమించేటపుడే ఈ విషయం చూసుకోవాలి. చూసుకోకపోవటం ప్రభుత్వం తప్పు. ఒకవేళ వయోపరిమితి విషయం తెలిసి కూడా కనగరాజ్ ను నియమించినట్లయితే ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా తప్పుచేసినట్లుగానే భావించాలి.

ఒకపుడు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి ఇదే కనగరాజ్ ను జగన్ ప్రభుత్వం నియమించింది. అయితే తన తొలగింపుపై నిమ్మగడ్డ కోర్టులో చేసిన పోరాటం ఫలించటంతో కనగరాజ్ తప్పుకోవాల్సొచ్చింది. అసలు నిమ్మగడ్డను తొలగించటమే అప్పట్లో ప్రభుత్వం చేసిన తప్పు. కమీషనర్ నియామకంలో సిఫారసు చేయటమే కానీ తొలగించే అధికారం లేని ప్రభుత్వం తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకుని తప్పుచేసింది.

మరి అదే పద్దతిలో ఇఫుడు కూడా కనగరాజ్ ను నియమించి తప్పుచేసిందా అనే చర్చ మొదలైంది. ప్రభుత్వం ఏ నియామకం చేసినా వెంటనే కోర్టులో కేసులు వేయించే ప్రతిపక్షాలున్నపుడు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తున్న వాళ్ళునపుడు ప్రభుత్వం ఎవరికీ ఆ అవకాశం ఇవ్వకూడదు. అంటే ఎవరిని అపాయింట్ చేసినా న్యాయ సమీక్షకు నిలిచేట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది మనవాళ్ళు అన్న ఏకైక అర్హతతో నియామకాలు చేస్తున్నంత కాలం కోర్టుల్లో కేసులు తప్పవని జగన్ గ్రహించాలి. మరి కనగరాజ్ కేసు ఏమవుతుందో చూడాల్సిందే.