దేవుళ్ల‌కు రాజ‌కీయ రంగు

రాజ‌కీయ నాయ‌కుల‌కు ప‌రిమితులంటూ ఏమీ ఉండ‌వు. ఏ విష‌యాన్ని అయినా అనుకున్న‌దే ఆల్యంగా రాజ‌కీయాలు చేసేస్తారు. త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల కోసం ప్ర‌జ‌ల పేరుతో ప్ర‌తి విష‌యానికి రాజ‌కీయ రంగు పులుముతుంటారు. అందుకు దేవుళ్లు కూడా మిన‌హాయింపేమీ మాదు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజ‌కీయాలు చూస్తుంటే అదే నిజ‌మ‌ని అనిపించ‌క మాన‌దు. ఇప్పుడ‌క్క‌డ దేవుళ్లు.. మ‌తం అధికార వైసీపీ ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు ఆయుధంగా మారాయి.

కేంద్రం విడుద‌ల చేసిన క‌రోనా మార్గ‌ద‌ర్శ‌నాల దృష్ట్యా రాష్ట్రంలో ఇక వైర‌స్ అదుపులోకి రాలేదు కాబ‌ట్టి బ‌హిరంగంగా వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌పై ఏపీ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. ఇళ్ల‌ల్లోనే పండ‌గ చేసుకోవాల‌ని సూచిస్తూ బ‌య‌ట మండ‌పాల ఏర్పాటు ఊరేగింపులు నిమ‌జ్జ‌నాల‌ను నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచే కాకుండా ప్ర‌జ‌ల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సందర్భాన్ని అవ‌కాశంగా తీసుకుని పార్టీలు మ‌త రాజ‌కీయాల‌కు తెర‌దీశాయ‌ని అది ప్ర‌జ‌స్వామ్యానికి చేట‌ని ఓ వ‌ర్గం ప్ర‌జ‌స్వామ్య వాదులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వినాయ‌క చ‌వితి ఉత్స‌వాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌డంతో దొరికిందో ఛాన్స్‌గా రాష్ట్ర బీజేపీ నేత‌లు నిర‌స‌న‌ల‌న‌కు దిగారు. జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆయ‌న హిందూ వ్య‌తిరేకి కావ‌డం కార‌ణంగానే వినాయ‌క చ‌వితి వేడుక‌ల‌కు అడ్డుప‌డుతున్నార‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌ని ఇప్ప‌టికే బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగింది. ఈ వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌డం వెన‌క కుట్ర ఉంద‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఆరోపించ‌డం రాజ‌కీయ వేడిని మ‌రింత పెంచింది. అయితే కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుగుణంగానే న‌డుచుకుంటున్నామ‌ని రాష్ట్రంలోని ఆ పార్టీ నేత‌లు రెచ్చ‌గొడితే ఊరుకునేది లేద‌ని వైసీపీ నేత‌లు ఎదురు దాడికి దిగ‌డంతో ఇప్పుడు రాజ‌కీయాల‌న్నీ వినాయ‌కుడి చుట్టూనే అల్లుకుని సాగుతున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

ఇక వైసీపీ పాల‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తున్న ఆ పార్టీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఈ వివాదంపై మ‌రో అడుగు ముందుకేశార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏసుకు లేని క‌రోనా గ‌ణేశ్‌కు ఎందుక‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏపీ చ‌ర్చిల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తించాడ‌న్ని గుర్తు చేసిన ఆయ‌న‌.. అక్క‌డ క‌రోనా రాదా? అని ప్ర‌శ్నించారు. హిందువులంద‌రూ ఆరాధించే వినాయ‌కుడి పూజ‌ల‌కు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నార‌ని విగ్ర‌హాలు ధ్వంసం చేసిన వాళ్ల‌ను ప‌ట్టుకోలేద‌ని ఇప్పుడేమో విగ్ర‌హాలు అమ్మ‌నీయ‌కుండా చేస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. దీంతో మొత్తానికి రాష్ట్రంలో రాజ‌కీయాల‌న్నీ దేవుళ్లు చుట్టు తిరుగుతున్నాయ‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.