విజయమ్మ చెపిందేమిటి ? చేసిందేమిటి ?

పైకి చెప్పిందేమో రాజకీయాలకు అతీతమైన సమావేశమని. అందుకే తాము నిర్వహించిన సమావేశానికి ఆత్మయ సమావేశమని చెప్పుకున్నారు. కానీ సమావేశంలో జరిగింది మొత్తం రాజకీయమే. మరి ఇంతోటిదానికి విజయమ్మ వివిధ పార్టీల్లోని ఒకప్పటి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారులను ఎందుకు పిలిచారో అర్ధం కావటంలేదు. దివంగత సీఎం వైఎస్సార్ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు విజయమ్మ పేరుతో సుమారు 350 మందికి ఆహ్వానాలు పంపారు.

తాము నిర్వహించబోయే సమావేశానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని చెప్పుకున్నారు. సరే ఆహ్వానాలు అందుకున్న వారిలో ఎంతమంది హాజరయ్యారనేది వేరేసంగతి. కానీ సమావేశంలో జరిగిందంతా కేవలం రాజకీయమే. తమ బిడ్డ వైఎస్ షర్మిలను ఆశీర్వదించమని విజయమ్మ అడగటం రాజకీయం కాక మరేమిటి. తెలంగాణాలో మళ్ళీ రాజన్న పాలనను తీసుకొస్తానని షర్మిల చెప్పటం రాజకీయం కాదా ? తన బిడ్డకు మద్దతుగా నిలవాలని, తెలంగాణాలో మళ్ళీ వైఎస్ పాలన తెస్తానని షర్మిల శపథం చేయటాన్ని ఏమంటారో విజయమ్మే చెప్పాలి.

సమావేశంలో చాలా మాట్లాడిన షర్మిల చివరగా తెలంగాణా ప్రజలంతా తన కుటుంబమని ఈ విధంగా తన తండ్రి తన గుండెలపై విల్లు రాశారని చెప్పటమేంటో షర్మిలకే తెలియాలి. గుండెలపై విల్లు రాయటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటంలేదు. మొత్తంమీద ఆత్మీయ సమావేశం ఫక్తు రాజకీయంగానే సాగింది. ఈ విషయాన్ని ముందుగా ఊహించే చాలామంది నేతలు హాజరుకాలేదు. హాజరైన నేతల్లో మాట్లాడిన వారుకూడా వైఎస్ తో తనకున్న సన్నిహితాన్ని గుర్తుచేసుకున్నారే కానీ విజయమ్మ, షర్మిల గురించి పెద్దగా ప్రస్తావించలేదు.

షర్మిల పార్టీకి మద్దతుగా నిలుస్తామని సమావేశానికి హాజరైన నేతల్లో ఒక్కరుగా కూడా బమిరంగంగా చెప్పలేదు. నిజానికి ఒకప్పటి వైఎస్ సన్నిహితులంతా ఇఫుడు చాలా పార్టీల్లో చేరిపోయున్నారు. తమ పార్టీ లైనును కాదని ఎవరు షర్మిలకు సాయం చేసే పరిస్దితుల్లో లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు షర్మిల పార్టీకి జనాల యాక్సప్టెన్స్ ఉందో లేదో కూడా తెలీదు. పైగా పార్టీలో షర్మిల తప్ప జనాలందరు గుర్తుపట్టే రెండోనేతే ఎవరు లేరు.

ఈ నేపధ్యంలో షర్మిల పార్టీలో చేరితే ఏమాత్రం ఉపయోగమని నేతలు ఎవరికి వారు ఆలోచించుకుంటారు. ప్రస్తుత రాజకీయ పార్టీల్లో సిద్ధాంతాలు ఎప్పుడో గాలికి కొట్టుకుపోయాయి. ఉన్నదంతా సొంత లాభం ఏమిటని ఆలోచించుకునే వాళ్ళే ఎక్కువమంది. ఇలాంటి పరిస్ధితుల్లో షర్మిల పార్టీలో ఎవరైనా ఎందుకు చేరుతారు ? ఈ ఏడాది చివరలో షర్మిల పాదయాత్ర చేస్తారని అంటున్నారు. ఆ పాదయాత్రలో జనాలు స్పందించే విధానాన్ని బట్టి నేతల ఆలోచానల్లో ఏమైనా మార్పొస్తుందేమో తెలీదు. కాబట్టి ఇఫ్పటికిప్పుడు నేతల నుండి షర్మిలకు దొరికే మద్దతు శూన్యమే.