పార్టీ కాదన్నా హాజరయ్యింది వీళ్ళేనా ?

మొత్తానికి రాజకీయంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన వైఎస్సార్ 12వ వర్దంతి ఆత్మీయ సదస్సు ముగిసింది. వైఎస్ ఆత్మీయులు, సన్నిహితులు, మద్దతుదారులంటు సుమారు 350 మందిని విజయమ్మ ఆత్మీయ సదస్సుకు పిలిచారు. రెండురాష్ట్రాల్లోని అధికారపార్టీలకు చెందిన టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల నుండి నేతలెవరు హాజరుకాలేదు. అయితే కాంగ్రెస్, బీజేపీల్లోని కొందరు నేతలు మాత్రం హాజరయ్యారు. రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు హాజరు కాకూడదని పార్టీ స్పష్టంగా చెప్పినా నలుగురు నేతలు హాజరవ్వటం గమనార్హం.

తెలంగాణా నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఖాన్ తో పాటు ఏపి నుండి కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఎన్. రఘువీరారెడ్డి హాజరయ్యారు. బీజేపీ నుండి మాజీ ఎంపి జితేందర్ రెడ్డి హాజరవ్వటంతో చాలామంది హాజరయ్యారు. ఇక వీరుకాకుండా కొందరు జర్నలిస్టులు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. రాజకీయాలతో సంబంధం లేదని విజయమ్మ ఎంతగా చెప్పినా ఇది కచ్చితంగా రాజకీయ సభే అనటంలో సందేహంలేదు.

ఇంతమంది రాజకీయనేతలను సమావేశానికి పిలిచిన తర్వాత ఈ సమావేశానికి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పటమే విచిత్రం. సుమారు 300 మందిని పిలిచిన రాజకీయంగా ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే చాలామంది సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. వైఎస్ తో అనుబంధం వేరు ప్రస్తుతం సమావేశానికి హాజరవ్వటం వేరని చాలామంది అనుకున్నారు. తెలంగాణాలో అధికారంలోకి రావటమే టార్గెట్ గా షర్మిల కొత్తగా రాజకీయపార్టీ పెట్టిన విషయం తెలిసిందే.

షర్మిల గనుక పార్టీ పెట్టుండకపోతే చాలామంది తెలంగాణాలోని నేతలు హాజరుయ్యేండేవారేమో. పైగా ఆహ్వానాలు విజయమ్మ పేరుతో అందినా మొత్తం వ్యవహారమంతా షర్మిల ఆధ్వర్యంలోనే జరిగింది. సరే హాజరుకాని నేతలను పక్కన పెట్టస్తే పార్టీ ఆదేశాలను సైతం కాదని కోటమిరెడ్డి, ఎంఏ ఖాన్, కేవీపీ, రఘువీరారెడ్డి హాజరవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. సమావేశానికి హాజరుకావద్దని ఏఐసీసీ నుండి వచ్చిన ఆదేశాలనే రెండు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు నేతలకు చేరవేశారు. అయినాసరే హాజరయ్యారు.

మరి పార్టీ ఆదేశాలను ఉల్లంఘించిన సమావేశానికి హాజరైన వీళ్ళపై ఏమైనా చర్యలుంటాయేమో చూడాలి. ఉండవల్లంటే కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు కాకుండా కొందరు డాక్టర్లు కూడా హాజరయ్యారు. మొత్తంమీద విజయమ్మ ఆత్మీయ సభ ఇటు ఫెయిల్ కాక అటు సక్సెస్ అని చెప్పలేని విధంగా ముగిసింది.