కేటీఆర్ ఇలాకాలో.. సంజ‌య్ స‌వాల్‌

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను మార్పులే ల‌క్ష్యంగా ప్ర‌జా సంగ్రామ యాత్ర పేరుతో పాద‌యాత్ర చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ దూకుడు కొన‌సాగిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా త‌న పాద‌యాత్ర‌ను పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. దీంతో పాటు అధికార టీఆర్ఎస్‌ను స‌వాల్ చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. కొద్దిరోజుల క్రిత‌మే మొద‌లైన ఆయ‌న పాద‌యాత్ర ఇప్పుడు ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో కొన‌సాగుతోంది. అయితే సెప్టెంబ‌ర్ 17న తెలంగాణ విమోచ‌న దినోత్స‌వ సంద‌ర్భంగా అధికార టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టేలా బండి సంజ‌య్ వ్యూహం ర‌చించిన్న‌ట్టు తెలుస్తోంది.

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని అధికారికంగా జ‌ర‌పాల‌ని ఎప్ప‌టి నుంచో రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని బీజేపీ డిమాండ్ చేస్తోంది. తాము అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా సెప్టెంబ‌ర్ 17ను తెలంగాణ విమోచ‌న దినోత్స‌వంగా నిర్వ‌హిస్తామ‌ని ఎప్పుడో ప్ర‌క‌టించింది. ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా త‌మ పార్టీ ఆధ్వ‌ర్యంలో బీజేపీ జెండా ఎగుర‌వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సారి కూడా ఆ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున నిర్వ‌హించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటోంది. మంత్రి కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గ‌మైన సిరిసిల్లాలో ఆ రోజు భారీ స‌భ నిర్వ‌హించ‌డం ద్వారా రెండు ర‌కాలుగా ప్రయోజ‌నం పొందాల‌ని బండి సంజ‌య్ వ్యూహం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వహించి ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచ‌డంతో పాటు కేటీఆర్ ఇలాకా అయిన సిరిసిల్లాలో స‌భ నిర్వ‌హించ‌డం వ‌ల్ల టీఆర్ఎస్‌ను స‌వాల్ చేసిన‌ట్లు అవుతుంద‌ని బండి సంజ‌య్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే త‌న పాద‌యాత్ర సెప్టెంబ‌ర్ 17 నాటికి సిరిసిల్లా చేరుకునేలా క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. పాద‌యాత్ర ఇంఛార్జ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు మ‌నోహ‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ మేర‌కు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలిసింది. గ‌తంలో వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్, నిజామాబాద్ న‌గ‌రాల్లో బీజేపీ తెలంగాణ విమోచ‌న దినోత్స‌వాన్ని నిర్వ‌హించింది.

ఈ సారి సిరిసిల్లాలో భారీ స‌భ పెట్టేందుకు బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. బండి సంజ‌య్ పాద‌యాత్ర ఈ నెల 4న వికారాబాద్‌కి, 7న సంగారెడ్డికి చేరుకుంటుంది. ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం 17న నిజామాబాద్‌కు చేరుకోవాల్సింది. కానీ ఇప్పుడు సిరిసిల్లాలో స‌భ నేప‌థ్యంలో పాద‌యాత్ర మార్గంలో మార్పులు చేయ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ర‌ప్పించేందుకు బండి సంజ‌య్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలిసింది. ఈ మేర‌కు అమిత్ షాను ఆయ‌న కోరిన‌ట్లు స‌మాచారం.