దసరా లైనప్ ఫిక్సయినట్లేనా?

కరోనా సెకండ్ వేవ్ తర్వాత తొలి ఫెస్టివల్ సీజన్ మీదికి టాలీవుడ్ ఫోకస్ మళ్లుతోంది. గత ఏడాది కరోనా కారణంగా పూర్తిగా వాషౌట్ అయిపోయిన దసరా సీజన్‌ను ఈసారి సద్వినియోగం చేసుకోవడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.

ఈసారి కూడా పరిస్థితులు పూర్తి ఆశాజనకంగా లేవు కానీ.. గత ఏడాదిలా అయితే లేవు. నెల కిందటే థియేటర్లు పున:ప్రారంభమై ఓ మోస్తరుగా నడుస్తున్నాయి. దసరా సమయానికి పూర్తిగా పుంజుకుని ఒకప్పటి పరిస్థితులు వస్తాయన్న ఆశలున్నాయి. ముందు అనుకున్నట్లయితే ఈ దసరాకి ‘ఆర్ఆర్ఆర్’ రావాల్సింది. కానీ ఆ చిత్రాన్ని వాయిదా వేయక తప్పట్లేదు.

దీంతో దసరా పండుగను క్యాష్ చేసుకోవడానికి పెద్ద సంఖ్యలోనే వేరే సినిమాలు సిద్ధమవుతన్నాయి. ఆల్రెడీ దసరా సెలవుల ఆరంభంలో, అక్టోబరు 8వ తేదీకి క్రిష్-వైష్ణవ్ తేజ్-రకుల్ ప్రీత్‌ల ‘కోండపొలం’ ఫిక్సయింది. దీనికి పోటీగా అదే రోజు అక్కినేని అఖిల్-పూజా హెగ్డే-బొమ్మరిల్లు భాస్కర్‌ల ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌’ను కూడా ఖాయం చేశారు. ఇక తర్వాతి వారం దసరా పండుగ రోజుకు శర్వానంద్-సిద్దార్థ్‌ల ‘మహాసముద్రం’ రాబోతోంది. దీనికి అక్టోబరు 13న రిలీజ్ డేట్ ఇచ్చారు. ఐతే పండుగ రోజుకు అదొక్కటే ఫిక్స్ కాదు.

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల క్రేజీ కలయికలో తెరకెక్కుతున్న ‘అఖండ’ను కూడా అక్టోబరు 13కే ఖాయం చేశారని.. ఇంకొన్ని రోజుల్లోనే ప్రకటన రాబోతోందని సమాచారం. దసరా సీజన్లో అత్యధిక అంచనాలున్న చిత్రం ఇదే. దసరా సీజన్‌కే ఖాయమైన మరో ఇంట్రెస్టింగ్ మూవీ కూడా ఉంది.

దిల్ రాజు తమ్ముడి కొడుకు అశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న ‘రౌడీ బాయ్స్’ అక్టోబరు 14న విడుదల కానున్నట్లు సమాచారం. ‘హుషారు’ దర్శకుడు హర్ష రూపొందించిన ఈ చిత్రంపై నిర్మాత దిల్ రాజు చాలా ధీమాగా ఉన్నాడు. అందుకే పండుగ సీజన్లో క్రేజీ సినిమాలకు పోటీగా దీన్ని నిలబెడుతున్నాడు. ఇలా మొత్తం ఐదు సినిమాలతో దసరా సీజన్ కళకళలాడబోతున్నట్లే.