కేసీఆర్ సార్‌.. అది క‌రెక్ట్ కాదు.. ఏపీ టీడీపీ ఎమ్మెల్యేల లేఖ‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లెట‌ర్‌ రాశారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మ‌రో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ నేయ స్వామి లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదులను తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరారు. గతంలో కూడా వారు వెలిగొండ ప్రాజెక్టు అంశానికి సంబంధించి ప్రకాశం జిల్లా ప్రజల మనోభావాలు, కోస్తా జిల్లాల ప్రజలు ఏమనుకుంటున్నది తదితర వాటిపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం.

రైతుల గురించి ఆలోచించండి!

ప్రకాశం జిల్లా రైతులకు వరప్రదాయనిగా ఉన్న వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని, నీటి కేటాయింపులు కూడా జరపొద్దని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం కృష్ణా యాజమాన్యం బోర్డుకు లేఖ రాయడాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని చెప్పడం సరికాదని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు లేదని, ఈ ప్రాజెక్టు చేర్చాలని జగన్ కేంద్రానికి విజ్ఞప్తి చేయకపోవడం పట్ల ప్రకాశం జిల్లా రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉందని టీడీపీ నేతలు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే తప్పిదాలకు ప్రజలు, రైతాంగాన్ని బాధితుల్ని చేయడం సరికాదన్నారు.

జ‌గ‌న్ వైఫ‌ల్యానికి ప్ర‌జ‌ల మూల్యం

వెలిగొండ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి చేసిన ఫిర్యాదును పునఃపరిశీలించి, ఉపసంహరిం చుకోవాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుకి అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భావిస్తోంద ని లేఖలో ప్రశ్నించారు. కేంద్ర గెజిట్ లో ఆ ప్రాజెక్టుని చేర్చకపోవడం ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వ వైఫల్యమే తప్ప.. ఆ ప్రాజెక్టు అనుమతులు లేనట్టు కాదని స్పష్టం చేశారు. 2014 పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ఆరు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపి, అనుమతులిచ్చిందని లేఖలో పేర్కొన్నారు. అందులో కల్వకుర్తి, నెట్టెంపాడుతో సహా వెలిగొండ కూడా ఉందని వివరించారు.

మీ హోదాకు త‌గ‌దు సార్‌!

ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి గత నెలలోనే గుర్తు చేసి, కేంద్ర గెజిట్లో చేర్చమని లేఖ ద్వారా కోరినప్పటికీ నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. ఫలితంగా వెలిగొండ ప్రాజెక్టుకు కేంద్ర గెజిట్ లో స్థానం లేదనే విషయాన్ని కేంద్రానికి తెలంగాణ చేసిన ఫిర్యాదులో ప్రస్తావించారన్నారు. ప్రభుత్వ తప్పిదాలను సాకుగా చూపి, తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి ఫిర్యాదులు చేయడం కేసీఆర్ హోదాకు తగదన్నారు. ప్రకాశం జిల్లాకు నష్టం కలిగించే విధంగా వ్యవహరించవద్దని లేఖలో కోరారు. ప్రాజెక్టు చివరి దశకు చేరుకున్న దశలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.