ఏపీ కాపులు ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారు ?

ఏపీలో కాపులు జ‌నాభా ప‌రంగా చాలా ఎక్కువుగా ఉన్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో వీరి పాత్ర మ‌రింత బ‌లంగా మారింది. ఇంకా చెప్పాలంటే కాపులు అంద‌రూ సంఘ‌టిత‌మైతే రాజ్యాధికారానికి కూడా వీరు చేరువ‌లో ఉండేంత బ‌లంగా మారారు. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా కూడా కాపు సామాజిక వ‌ర్గ‌మే డిసైడ్ చేసే ప‌రిస్థితి ఏపీలో ఉంది. అయితే గ‌త రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఏపీలో కాపు వ‌ర్గం చాలా సైలెంట్‌గా ఉంది. ఎక్క‌డా వీరి వాయిస్ విన‌ప‌డ‌డం లేదు.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఐదేళ్ల పాటు కాపులు ఎప్ప‌టిక‌ప్పుడు రోడ్ల మీద‌కు వ‌చ్చి బ‌లంగా వాయిస్ వినిపించే వారు. త‌మ జాతి హ‌క్కుల కోసం గ‌ట్టిగా ఫైట్ చేయ‌డంతో పాటు పోరాటాలు చేసేవారు. కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం ముద్ర‌గ‌డ పద్మ‌నాభం ఆధ్వ‌ర్యంలో నాడు ప్రారంభ‌మైన ఉద్య‌మం ఒక్క‌సారిగా ఉవ్వెత్తున పైకి ఎగ‌సిప‌డింది. దానిని కంట్రోల్ చేసేందుకు నాడు ముఖ్య‌మంత్రిగా ఉన్న చంద్ర‌బాబుకు త‌ల‌ప్రాణం తోకుమీద‌కు వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు కాపు ఉద్య‌మాన్ని సైలెంట్ చేసి.. కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి సీనియ‌ర్ నేత కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుకు కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.

చివ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఈబీసీ రిజ‌ర్వేష‌న్లు 10 శాతం ఇస్తే చంద్ర‌బాబు అందులో కూడా 5 శాతం కాపుల‌కు ఇచ్చేశారు. క‌ట్ చేస్తే ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉంది. ఈబీసీలో కాపుల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లు ఎత్తేశారు. పైగా ఎన్నిక‌ల‌కు ముందే కాపు రిజ‌ర్వేష‌న్లు త‌మ ప‌రిధిలోవి కావ‌ని చెప్పేశారు. కాపుల గురించి ప్ర‌త్యేకంగా చేస్తోందేమి లేదు. పైగా అన్ని కులాల‌కు కార్పొరేష‌న్లు రావ‌డంతో కాపు కార్పొరేష‌న్ ప్ర‌యార్టీ కూడా లేకుండా పోయింది.

అయితే ఇప్పుడు వీటి గురించి గొంతెత్తే వారే లేకుండా పోయారు. పైగా ముద్ర‌గ‌డ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. బాబును కాపు వ్య‌తిరేకిగా బ‌లంగా ముద్ర వేసిన కాపు నేత‌ల నోళ్లు ఇప్పుడు మూగ‌బోయాయి. ఇక జ‌గ‌న్ కాపు నేత‌ల‌కు న‌లుగురికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. వీరితో పాటు నామినేటెడ్ ప‌ద‌వుల్లోనూ పై నుంచి కింద వ‌ర‌కు వారికి ఏదో ఒక ప‌ద‌వి క‌ట్ట‌బెడుతూ వ‌స్తున్నారు.

దీనికి తోడు తోట త్రిమూర్తుల‌తో మొద‌లు పెడితే బ‌ల‌మైన కాపు నేత‌లు అంద‌రూ వైసీపీలో చేరిపోయారు. వీళ్ల‌కు ప‌ద‌వులు వ‌చ్చాయి. ఇక ప‌ద‌వులు లేని కాపు నేత‌ల్లో చాలా మంది చిన్న‌వారు.. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన వారు ఉన్నారు. వీరు మాత్ర‌మే గుర్తొచ్చిన‌ప్పుడు మాట్లాడ‌డం మిన‌హా చేస్తోందేమి లేదు. ఇక అదే సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం దీని గురించి మాట్లాడ‌డం లేదు. సో ఈ లెక్క‌న చూస్తే ఏపీలో కాపుల వాయిస్ వినిపించే బ‌ల‌మైన కాపు నేత‌లు క‌న‌ప‌డ‌డం లేదు.