చిక్కుల్లో ఏపీ హోం మంత్రి సుచరిత..!

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి సుచరిత చిక్కుల్లో పడ్డారు. ఆమెపై జాతీయ ఎస్సీ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆమెపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మ్యాటరేంటంటే.. సుచరిత ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలోనూ ఆమె అక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఆమె రిజర్వేషన్లు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఓ టీవీ ఇంటర్యూలో తాను క్రిస్టియన్‌ను అని.. తన కుటుంబం అంతా మతం మారిందని ఆమె చెప్పుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం మతం మరిన ఎస్సీలకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ కారణంగా సుచరిత టీవీ ఇంటర్యూలో చెప్పిన దాన్ని బట్టి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వారం రోజుల్లోగా వివరాలు పంపాలని జాతీయ ఎస్సీ కమిషన్ గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. ఇప్పుడీ విషయం ఏపీ రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయింది.

అయితే ఇలా మతం మారి ఎస్సీ రిజర్వేషన్‌ను దుర్వియోగం చేశారనే ఆరోపణలతో విచారణ ఎదుర్కొన్న వారిలో సుచరిత మొదటి వారు కాదు. 2019లోనే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఆమె కూడా తాను క్రిస్టియన్‌ను అని.. తన భర్త కాపు సామాజికవర్గం వారని టీవీ ఇంటర్యూల్లో చెప్పుకున్నారు. ఆమె విషయం పెద్దగా చర్చలోకి రాలేదు కానీ.. ఇప్పుడు హోం మినిస్టర్ సుచరిత విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.