ఎస్సీ నియోజకవర్గాల్లో కొత్త ప్రయోగం

మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిలు చాలామంది కాడి దింపేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారిని తీసేయాలా ? లేకపోతే వారిని పిలిపించి మాట్లాడి స్పీడు పెంచేలా చర్యలు తీసుకోవాలా అనే విషయమే చంద్రబాబునాయుడుకు సమాలోచనలు చేస్తున్నారట. ఇన్చార్జిలు కాడిదింపేయటం ఏదో ఒకటో రెండో నియోజకవర్గాల్లో అయితే పర్వాలేదు. చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్ధితి కనబడుతుండటంతో ఏమి చేయాలో అర్ధం కావటంలేదు.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోని ఐదు నియోజకవర్గాల్లో ఇదే పరిస్ధితి కనబడుతోందట. గంగాధర నెల్లూరు లాంటి ఎస్సీ నియోజకవర్గాల్లో ఇన్చార్జిల సమస్య ఎక్కువుగా ఉందని సమాచారం. అందుకనే నియోజకవర్గాల ఇన్చార్జిలుగా నాన్ ఎస్సీలను నియమిస్తే ఎలాంటి గొడవ ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. నాన్ ఎస్సీ నేతలను ఇన్చార్జిలుగా నియమిస్తే ఎంఎల్ఏ టికెట్ కోసం ఆశించే అవకాశం ఉండదు.  పైగా పార్టీ బలోపేతానికి గట్టిగా కృషి చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారట. ఈ ఐడియా బాగా వర్కవుట్ అయ్యే అవకాశం ఉందని బాబు భావిస్తున్నారట.

పార్టీ కోసం గట్టిగా పనిచేసిన నాన్ ఎస్సీ నేతలకు  పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్ధానం ఇస్తే సరిపోతుందని అధినేత నిర్ణయించారట. కాకపోతే ముందే ఓ షరతు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఎంఎల్ఏ టికెట్ ఎవరికివ్వాలనే విషయంలో ఎట్టి పరిస్థితిలోను సదరు నేతలు జోక్యం చేసుకోకూడదనేది షరతుగా తెలుస్తోంది. అలా కాకుండా వీళ్ళ జోక్యం పెరిగిపోతే నియోజకవర్గాల స్ధాయిలోనే ఎస్సీ నేతల మధ్య స్వయంగా ఈ నేతలే వివాదాలను ప్రోత్సహించినట్లవుతుందని చంద్రబాబు అనుమానిస్తున్నారట.

ఈ ప్లాన్ ప్రకారమే రాష్ట్రంలోని ఎస్సీ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉన్న నేతలెవరు ? కాడి దింపేసిన నేతలెవరు ? పార్టీని ముందుండి నిడిపించటంలో ఆసక్తిని చూపుతున్న నేతలెవరు అనే జాబితాను చంద్రబాబు రెడీ చేస్తున్నారట. నేతల్లో కూడా ముఖ్యంగా యువతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని ప్రకారమే జిల్లాల వారీగా నాయకులను గుర్తించటంలో కసరత్తు మొదలుపెట్టారట. మరి ఈ కసరత్తు ఎప్పటికవుతుంది ? కొత్త ఇన్చార్జిలు ఎప్పుడు అపాయింట్ అవుతారో చూడాల్సిందే.