అంబాసిడ‌ర్‌గా సోనుసూద్.. కేజ్రీవాల్ వ్యూహం అదే

క‌రోనా కార‌ణంగా దేశంలో విధించిన లాక్‌డౌన్ స‌మ‌యంలో ఎంతోమంది ప్ర‌జ‌ల కష్టాల‌ను తీర్చిన న‌టుడు సోనుసూద్ దేవుడ‌య్యాడు. వ‌ల‌స కూలీలు మొద‌లు అడిగిన వాళ్ల‌కు అడ‌గ‌ని వాళ్ల‌కు సాయం చేస్తూనే ఉన్నారు. రోగుల‌కు మందులు, ఆక్సిజ‌న్‌.. ఆక‌లితో అల‌మ‌టించిన పేద‌ల‌కు అన్నం.. విద్యార్థుల‌కు పుస్త‌కాలు, స్మార్ట్‌ఫోన్లు ఇలా అవ‌స‌రాల్లో ఉన్న‌వాళ్లంద‌రికీ అండ‌గా నిలిచిన సోనుసూద్‌ను రియ‌ల్ హీరోగా దేశ‌మంతా కీర్తించింది. ఓ వ్య‌క్తిగా ఇంత‌టి గొప్ప ప‌నులు చేస్తున్న ఆయ‌న‌.. రాజ‌కీయాల్లోకి వ‌స్తే మ‌రెంత‌గానో సేవ చేస్తార‌ని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే సోనుసూద్‌తో ఢిల్లీ సీఏం కేజ్రీవాల్ భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. చిల్డ్ర‌న్ మెంటార్‌షిప్ కార్య‌క్రమ‌మైన దేశ్ కే మెంట‌ర్స్ కు ఢిల్లీ ప్ర‌భుత్వ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సోనుసూద్ ప‌నిచేయ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు.

అయితే సోనుసూద్‌తో కేజ్రీవాల్ భేటీ వెన‌క మ‌రో వ్యూహం దాగి ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పంజాబ్‌లో రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి సారించింది. వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో అక్క‌డ పార్టీ బ‌లోపేతంపై కేజ్రీవాల్ దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇటీవ‌ల పంజాబ్‌లో ప‌ర్య‌టించారు. ఆయ‌న స‌మక్షంలో శిరోమ‌ణి అకాలీద‌ళ్‌కు చెందిన కొంత‌మంది కీల‌క నేత‌లు ఆమ్ ఆద్మీలో చేరారు. మ‌రోవైపు సోనుసూద్ పంజాబ్‌లోని మోగా ప‌ట్ట‌ణంలో పుట్టి పెరిగారు. దీంతో అక్క‌డ ప‌ట్టు సాధించేందుకు సోనుసూద్‌కున్న క్రేజ్‌ను వాడుకోవాల‌ని పార్టీ భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న పార్టీలోకి చేరితే పంజాబ్‌లో అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో ఉంది. అయితే రాజ‌కీయాల్లోకి రావాల‌ని ఎప్పుడూ ఆలోచించ‌లేద‌ని కేజ్రీవాల్‌తో కూడా ఆ విష‌యం గురించి మాట్లాడ‌లేద‌ని తాజాగా సోనుసూద్ స్ప‌ష్టం చేశాడు.

సోనుసూద్‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేక‌పోయిన‌ట్లే ఆయ‌న సోద‌రి మాళ‌విక స‌చార్‌ను ఆమ్ఆద్మీ పార్టీలో చేర్చుకునే అవ‌కాశాలున్నాయి రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌పడుతున్నారు. పంజాబ్ ప్ర‌భుత్వ కొవిడ్ టీకా కార్య‌క్ర‌మానికి సోనూ అంబాసిడ‌ర్‌గా ఉన్నారు. ఆయ‌న సోద‌రి మాళ‌విక కూడా స్థానికంగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మాల‌కూ ముఖ్య అతిథిగా వెళ్తున్నారు. దీంతో అక్క‌డి అధికార కాంగ్రెస్ పార్టీలో ఆమె చేర‌వ‌చ్చ‌నే ఊహాగానాలు వ‌స్తున్నాయి. దీంతో ముందుగానే ఆమెను ఆమ్ఆద్మీలో చేర్చుకునేందుకు కేజ్రీవాల్ క‌స‌ర‌త్తులు ప్రారంభించార‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెను మోగా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పార్టీ బ‌రిలో దింపే అవ‌కాశాలున్నాయ‌ని చెప్తున్నారు.