దేశంలోని ఆ రాష్ట్రంలో మూడో వేవ్ ఎంట్రీ ఇచ్చేసినట్లేనా?

దేవతలు నడయాడిన భూమిగా అభివర్ణించే కేరళలో ఇప్పుడు దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆ చిన్న రాష్ట్రం ఇప్పుడు కరోనాతో కిందా మీదా పడుతోంది. దేశంలోని మరే రాష్ట్రంలో అమలు చేయనంత కఠినంగా కొవిడ్ నిబంధనల్ని అమలు చేస్తున్నా.. కేసుల నమోదు మాత్రం అంతకంతకూ ఎక్కువ అవుతూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా ఆ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే.. మూడో వేవ్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చినట్లేనా? అన్న భావన కలుగక మానదు.

బుధవారం ఒక్కరోజులో కేరళ రాష్ట్రంలో 31వేల కేసులకు పైనే నమోదు కావటం.. అక్కడ టెస్టు పాజిటివిటీ రేటు 19 శాతానికి చేరుకోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. దేశంలోని మరే రాష్ట్రంలో లేని దారుణ పరిస్థితి కేరళలో ఉన్నట్లు చెబుతున్నారు. బుధవారం ఒక్కరోజులో దేశ మొత్తంగా నమోదైన కేసులు 46వేలు అయితే.. అందులో ఒక్క కేరళలోనే 30 వేలు ఉండటంతో.. ఇప్పుడీ రాష్ట్రంలో మూడో వేవ్ మొదలైందా? అన్న సందేహం కలుగక మానదు.

వచ్చే నెలలో దేశంలో మూడో వేవ్ విరుచుకుపడనుందన్న అంచనాలు వినిపిస్తున్న వేళ.. తాజాగా కేరళలో ఒక్క రోజులో 31,445 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాదు.. రోజులో కొవిడ్ బారిన పడి 215 మంది మరణించారు. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్న వేళ..అక్కడి పినరయి ప్రభుత్వం రియాక్టు అయ్యింది. కొవిడ్ వేగంగా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నా.. కేసుల నమోదు మాత్రం ఆగని పరిస్థితి.

నిన్న ఒక్క రోజులో కేరళ తర్వాత అత్యధిక కేసులు నమోదైంది మహారాష్ట్రలోనే. అక్కడ 5031 కేసలుు నమోదు కాగా.. కర్ణాటక (1224), తమిళనాడు (1573), ఆంధ్రప్రదేశ్ (1601) కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదవుతున్న కేసుల తీవ్రత చూస్తే.. దక్షిణాదినే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దక్షిణాదిన ఉన్న ఐదు రాష్ట్రాల్లోనే దాదాపు 38 వేల కేసులు ఉన్నాయి. వాటికి మహారాష్ట్ర 5వేల కేసులు కలిపితే.. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కేవలం 3వేల కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. దేశంలో కేసులు తీవ్రత ఉన్నవి రెండు రాష్ట్రాలేనని చెప్పాలి.

మొదటి.. రెండో వేవ్ లో కేరళలో కేసుల నమోదు చాలా చాలా తక్కువగా ఉంది. ఆ కొరతను తీరుస్తూ.. తాజాగా మాత్రం భారీగా కేసులు నమోదు కావటం చూస్తే.. థర్డ్ వేవ్ కేరళలో మొదలైందా? అన్న సందేహాల్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కేరళలో నమోదవుతున్న కేసుల తీవ్రత మాత్రం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. ముందస్తు జాగ్రత్తగా కేరళను రిమోట్ లో ఉంచి.. ఆ రాష్ట్రంతో మిగిలిన రాష్ట్రాలకు ఉండే లింకుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.