వాళ్ల‌పై బాబు క‌న్నేశారా?

రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం.. ఒక‌టికి రెండు సార్లు అధికారాన్ని చేప‌ట్టిన సామ‌ర్థ్యం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సొంతం. కానీ గ‌త 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నం ముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న నిల‌బ‌డ‌లేక‌పోయారు. ఘోర ప‌రాజ‌యాన్ని చ‌విచూశారు. ఒక‌ప్పుడు వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ ఆ త‌ర్వాత ఢీలా ప‌డిపోయింది. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి మునుప‌టి వైభ‌వాన్ని క‌ట్ట‌బెట్టేందుకు బాబు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను తిరిగి ద‌గ్గ‌ర చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టిన‌ట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను భారీ స్థాయిలోనే అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ కొన్ని విష‌యంలో మాత్రం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త క‌లుగుతోంది. ముఖ్యంగా అప్పుల విష‌యం ప్ర‌ధాన స‌మస్యగా మారింది. అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ వైసీసీ మ‌రోసారి అధికారాన్ని చేజిక్కించుకోవ‌డం కోసం గ‌ట్టిపోటీనే ఇవ్వ‌నుంది. ఈ ప‌రిస్థితుల్లో టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డం కోసం జ‌గ‌న్‌తో త‌ల‌ప‌డేందుకు బాబు ఇప్ప‌టి నుంచే సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న పార్టీకి దూర‌మైన వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌కు చేర్చుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏపీలో ప్ర‌ధానంగా రైతులు, యువ‌త తెలుగు దేశం పార్టీకి దూర‌మ‌య్యారు. 2014లో అధికారం చేప‌ట్టిన త‌ర్వాత రైతు రుణ‌మాఫీని ఏక‌కాలంలో అమ‌లు చేయ‌డంలో బాబు విఫ‌ల‌మ‌య్యారు. దీంతో రైతులు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారారు. ఆ ఎన్నిక‌ల హామీలో భాగంగా రైతు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ద‌శ‌ల‌వారీగా మాఫీ చేస్తామ‌ని మెళిక పెట్టారు. దీంతో విడుద‌ల చేసిన నిధులు కూడా వ‌డ్డీలు క‌ట్ట‌డానికి స‌రిపోయాయ‌నే ఆవేద‌న‌తో రైతులు చంద్ర‌బాబుపై తిరుగుబావుటా ఎగ‌రేశారు.

మ‌రోవైపు బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌ని 2014 ఎన్నిక‌ల ప్ర‌చారంలో నిరుద్యోగులు టీడీపీ ప‌క్షాన నిల‌బ‌డ్డారు. అడుగ‌డుగునా యువ‌త ఆ పార్టీకి అండ‌గా నిలిచింది. కానీ ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో బాబు విఫ‌ల‌మ‌య్యార‌నే విమ‌ర్శ‌లున్నాయి. ఎప్ప‌డూ అమ‌రావ‌తి, పోల‌వ‌రంపైనే ప్ర‌ధాన దృష్టి పెట్టిన ఆయ‌న నిరుద్యోగులకు న్యాయం చేయ‌లేక‌పోయార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. కానీ 9 లక్షలకు పైగా చంద్రబాబు ఉద్యోగాలు ఇచ్చినా దానిని ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. బాబు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదన్న ప్రచారమే యువతలోకి వెళ్లింది. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఆ నిరుద్యోగ యువ‌త జ‌గ‌న్ వైపు మొగ్గు చూపింది. ఇటీవలే వైసీపీ సర్కారు స్వయంగా చంద్రబాబు 9 లక్షల పైచిలుకు ఉద్యోగ కల్పన చేసినట్లు రుజువు చేసింది.

ఇప్పుడిక వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకున్న బాబు.. ఈ రెండు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే ప్ర‌య‌త్నాల్లో పడ్డార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జాబ్ క్యాలెండ‌ర్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌డంతో పాటు కొత్త జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌కు దిగింది. మ‌రోవైపు రైతుల నుంచి ధాన్యం కోనుగోలు చేసిన ప్ర‌భుత్వం డ‌బ్బులు చెల్లించ‌డం లేదంటూ నియోజ‌క‌వర్గాల్లో రైతుల‌తో ర్యాలీలు నిర్వ‌హిస్తూ తాను రైతు ప‌క్ష‌పాతినే అని చాటే ప్ర‌య‌త్నం బాబు చేస్తున్నారు. మ‌రి ఈ ప్ర‌య‌త్నాలు ఫ‌లించి ఈ రెండు వ‌ర్గాల ప్ర‌జ‌లు బాబుకు మ‌ద్ద‌తుగా నిలుస్తారా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను త‌ట్టుకుని బాబు నిల‌బ‌డ‌తారా? అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే 2023 వ‌ర‌కూ ఆగాల్సిందే.